మాజీ జడ్జీలు రాజకీయాల్లో చేరకూడదు

మాజీ జడ్జీలు రాజకీయాల్లో చేరకూడదు
మాజీ జడ్జీలు రాజకీయాల్లో చేరకూడదని సుప్రీంకోర్టు మాజీ చీఫ్‌ జస్టిస్‌ డి. వై. చంద్రచూడ్‌ స్పష్టం చేశారు. జడ్జి సమాజం మాజీ జడ్జీలను చట్టం సంరక్షకులుగానే చూస్తోందని, న్యాయవ్యవస్థపై సమాజానికున్న విశ్వాసానికి అనుగుణంగానే జడ్జీల జీవన విధానం ఉండాలని ఆయన తెలిపారు. ఆదివారం నిర్వహించిన సంవిధాన్‌ @ 75 కార్యక్రమంలో మీడియా ప్రశ్నలకు ఆయన సమాధాన మిచ్చారు. 
 
తాను రాజకీయాల్లో చేరనని చెబుతూ ఇది తన విధులు, న్యాయవ్యవస్థ సమగ్రతపై సందేహాన్ని కలిగిస్తుందని ఆయన పేర్కొన్నారు. పదవీ విరమణ చేసినప్పటికీ సమాజం జడ్జీగానే చూస్తుందని, రాజకీయాల్లో చేరడం సరైన చర్యగా సమాజం భావించదని ఆయన తెలిపారు. పదవీ విరమణ చేసిన వెంటనే రాజకీయాల్లో చేరితే ఆయన విధుల్లో ఆ పార్టీ ప్రభావం ఉండవచ్చని సమాజాంలో నిర్దిష్ట అవగాహన ఏర్పడే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు.
 
కేసుల తీర్పులను ప్రభావితం చేసేందుకు కొందరు సోషల్‌ మీడియాను ఉపయోగిస్తున్నారని పేర్కొంటూ దానిపై అప్రమత్తంగా ఉండాలని అవసరం ఎంతైనా ఉందని ఆయన సూచించారు. ప్రస్తుత రోజుల్లో యూట్యూబ్‌, సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ కారణంగా 20 సెకన్ల ఆధారంగా అభిప్రాయాన్ని ఏర్పరచాలని కోరుకుంటున్నారని చెబుతూ ఇది ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు. 
 
కోర్టుల నిర్ణయాలపై తన అభిప్రాయాన్ని వ్యక్తీకరించేరందుకు ప్రతి పౌరుడికి హక్కు ఉందని, అయితే, కోర్టు నిర్ణయాలను దాటి న్యాయమూర్తులను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకున్న సమయంలో ‘ఇది నిజంగా భావ ప్రకటన స్వేచ్ఛా? అనే ప్రాథమిక ప్రశ్నను లేవనెత్తుతుందని ఆయన చెప్పా రు. కోర్టుల్లో నిర్ణయం తీసుకునే ప్రక్రియ చాలా తీవ్రమైందని, దీన్ని అర్థం చేసుకునే ఓపిక, సహనం ఎవరికీ లేదని విచారం వ్యక్తం చేశారు. ఇది చాల చిన్న విషయమైనా భారత న్యాయవ్యవస్థ ఎదుర్కొంటున్న చాలా తీవ్రమైన సమస్య అని జస్టిస్‌ చంద్రచూడ్‌ పేర్కొన్నారు. 
 
సోషల్‌ మీడియా ట్రోల్స్‌ న్యాయమూర్తులపై ప్రభావం చూపుతుందా? అన్న ప్రశ్నకు ఆయన స్పందిస్తూ న్యాయస్థానాల్లో తీసుకుంటున్న నిర్ణయాలను మార్చేందుకు ప్రత్యేక వర్గాలు ప్రయత్నిస్తున్నాయని, ఈ క్రమంలో న్యాయమూర్తులు జాగ్రత్తగా ఉండాలని హితవు చెప్పారు. ప్రజాస్వామ్యంలో చట్టాల చెల్లుబాటును నిర్ణయించే అధికారం రాజ్యాంగ న్యాయస్థానాలకు అప్పగించినట్లు గుర్తు చేశారు. 
 
అధికార విభజన చట్టాన్ని రూపొందించే పనిని శాసనసభ చేస్తుందని, చట్టాన్ని అమలు చేయడం కార్యనిర్వాహక వర్గం ద్వారా జరుగుతుందని, న్యాయవ్యవస్థ చట్టాన్ని అర్థం చేసుకుని వివాదాలను పరిష్కరిస్తుందని వివరించారు. రాజ్యాంగం ప్రకారం జోక్యం చేసుకోవాల్సిన బాధ్యత న్యాయస్థానాలకు ఉందని స్పష్టం చేశారు.విధాన రూపకల్పన అనేది శాసనసభ పని, కానీ దాని చెల్లుబాటును నిర్ణయించడం న్యాయస్థానాల పని, బాధ్యత అని జస్టిస్ చంద్రచూడ్ తెలిపారు. 
 
అదే సమయంలో కొలీజియం వ్యవస్థను ఆయన సమర్థించారు. దీనిపై అపోహలు ఉన్నాయని, వాటిని తొలగించాల్సిన అవసరం ఉందని చెప్పారు. న్యాయమూర్తుల నియామకంలో కొలీజియం ప్రత్యేక పాత్ర పోషిస్తుందదని చెప్పారు.