మహిళల ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీ విజేత భారత్‌

మహిళల ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీ విజేత భారత్‌

* చైనాను ఓడించిన మహిళల జట్టు

భారత మహిళల హాకీ జట్టు అద్భుత ప్రదర్శనతో ఆసియా కప్‌ టైటిల్‌ని నెగ్గింది. ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో చైనాను 1-0తో ఓడించి టైటిల్‌ను కైవసం చేసుకుంది. తద్వారా భారత మహిళల జట్టు మూడోసారి టైటిల్‌ను కైవసం చేసుకుంది. మూడో క్వార్టర్‌లో దీపికా భారత్‌ తరఫున గోల్‌ చేయడంతో గెలుపు వరించింది. 
 
31వ నిమిషంలో పెనాల్టీ కార్నర్‌లో దీపిక గోల్ చేసి జట్టుకు ఆధిక్యాన్ని అందించింది. నిర్ణీత సమయానికి చైనా జట్టు గోల్‌ చేయకపోవడంతో ఓటమిపాలు కావాల్సి వచ్చింది. టోర్నీ దక్షిణ కొరియా మూడుసార్లు విజేతగా నిలువగా.. టీమిండియా సమం చేసింది.

బిహార్‌ స్పోర్ట్స్‌ యూనివర్సిటీ స్టేడియంలో జరిగిన ఆసియా కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో టీమిండియా డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగింది. మ్యాచ్‌లో ఆద్యాంతం రాణించి అద్భుతమైన ప్రదర్శనతో టైటిట్‌ను కాపాడుకోగలిగింది. ఫైనల్‌లో భారత్‌కు చైనా గట్టి పోటీ ఇచ్చింది. దాంతో తొలి రెండు క్వార్ట్స్‌లో ఇరుజట్లు గోల్స్‌ చేయలేకపోయాయి. 

అయితే, మూడో క్వార్టర్స్‌లో దీపికా గోల్‌ చేసి భారత్‌ను ఆధిత్యంలో వెళ్లేలా చేసింది. ఈ టోర్నీలో దీపికకు ఇది 11వ గోల్‌కావడం విశేషం. గతేడాది రాంచీలో 2016లో సింగపూర్‌లో ఈ టైటిల్‌ను గెలుచుకున్న భారత జట్టు అద్భుతంగా సమన్వయం చేస్తూ ఓపికతో చైనాను నిలువరించింది. తొలి అర్ధభాగంలో ఎలాంటి గోల్‌ చేయకపోయినా.. ద్వితీయార్థం తొలి నిమిషంలో దీపికా పెనాల్టీ కార్నర్‌లో గోల్‌ చేసి అభిమానుల్లో జోష్‌ నింపింది.

మూడో క్వార్టర్‌లోనే భారత్‌కు ఆధిక్యాన్ని రెట్టింపు చేసే సువర్ణావకాశం లభించింది. అయితే 42వ నిమిషంలో పెనాల్టీ స్ట్రోక్‌లో దీపిక కొట్టిన షాట్‌ను చైనా గోల్‌కీపర్ కుడివైపు డైవ్ చేసి కాపాడింది. మూడో క్వార్టర్‌లో భారత్‌కు పెనాల్టీ కార్నర్ లభించినా గోల్‌గా మలచలేకపోయారు. అయితే, మ్యాచ్‌ చివరలో మరోసారి భారత క్రీడాకారులు తడబడ్డారు. 

జపాన్‌తో జరిగిన సెమీఫైనల్స్‌లో 16 పెనాల్టీ కార్నర్‌లో ఒక్కదాన్ని కూడా గోల్స్‌గా మలచలేకపోయిన విషయం తెలిసిందే. ఫైనల్‌లో మొదటి 30 నిమిషాల్లోనూ నాలుగు పెనాల్టీ కార్నర్‌ వృథా అయ్యాయి. పెనాల్టీ కార్నర్‌లో గోల్‌ సాధించడం భారత్‌కు బలహీనంగా మారింది. ఈ టోర్నమెంట్‌లో భారత్ అజేయంగా నిలిచి ట్రోఫీని సాధించడం విశేషం. లీగ్ దశలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. ఆడిన అన్ని మ్యాచుల్లోనూ విజయం సాధించింది.

అంతేగాక లీగ్ సమరంలో చైనాను మట్టికరిపించింది. తాజాగా ఫైనల్లోనూ మరోసారి చైనాను ఓడించి మూడోసారి ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీని దక్కించుకుంది. ఇదే క్రమంలో దక్షిణ కొరియా పేరిట ఉన్న మూడో ట్రోఫీల రికార్డును సమం చేసింది. బిహార్‌లో రాజ్‌గిర్ వేదికగా జరిగిన ఈ టోర్నమెంట్‌లో భారత్‌తో పాటు మలేసియా, చైనా, దక్షిణ కొరియా, జపాన్, థాయిలాండ్ జట్లు పాల్గొన్నాయి. భారత్ లీగ్ దశలో ఐదు మ్యాచుల్లో విజయం సాధించింది. రెండో సెమీఫైనల్లో జపాన్‌ను ఓడించి ఫైనల్‌కు చేరుకుంది.