నేనుండగా ఆర్టికల్ 370 పునరుద్ధరణ కుదరదు

నేనుండగా ఆర్టికల్ 370 పునరుద్ధరణ కుదరదు
తానుండగా జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 పునరుద్ధరణ కుదరదని ప్రధాని నరేంద్రమోదీ స్పష్టం చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ధూలేలో ఏర్పాటు చేసిన మొదటి బహిరంగసభలో ఆయన ప్రసంగిస్తూ  జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370 పునరుద్ధరణకు కాంగ్రెస్‌ ప్రయత్నిస్తున్నదని ఆయన ఆరోపించారు. ఈ క్రమంలో మహారాష్ట్ర ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

జమ్మూ కాశ్మీర్ నుంచి రాజ్యాంగాన్ని దూరం చేయాలని ఇండియా కూటమి చూస్తున్నదని ప్రధాని  ఆరోపించారు. అక్కడ 370 అధికరణాన్ని ప్రపంచంలోని ఏ శక్తీ పునరుద్ధరించజాలదని ఆయన స్పష్టం చేశారు.  కాంగ్రెస్, దాని మిత్ర పక్షాలు ‘పాకిస్తాన్ అజెండాను’ ప్రోత్సహించరాదని, వేర్పాటువాదుల భాష మాట్లాడరాదని ప్రధాని కోరారు. తనకు ప్రజల ఆశీస్సులు ఉన్నంత కాలం ఆ అజెండా నెగ్గజాలదని మోదీ  అన్నారు. 

‘జెకెలో అంబేద్కర్ రాజ్యాంగాన్ని మాత్రమే అనుసరిస్తారు. 370 అధికరణం పునరుద్ధరణ కోసం జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో ఒక తీర్మానాన్ని ఎలా ప్రవేశపెట్టారో మీరు టివిలో చూసే ఉండాలి. బిజెపి ఎంఎల్‌ఎలు నిరసిస్తే వారిని బయటకు వెళ్లగొట్టారు. దేశం, మహారాష్ట్ర ఈ విషయం అర్ధం చేసుకోవాలి’ అని మోదీ కోరారు.

దళితులు, ఆదివాసీలను రెచ్చగొట్టేందుకు ఇండియా కూటమి రాజ్యాంగంగా చూపేందుకు ఖాళీ పుస్తకాలను ప్రదర్శిస్తున్నాయని ప్రధాని ఆరోపించారు. మహారాష్ట్రలోని మహా వికాస్ అఘాడి (ఎంవిఎ) చక్రాలు, బ్రేకులు లేని బండి అని ప్రధాని  అభివర్ణించారు. డ్రైవర్ సీటు కోసం ఎంవిఎలో పోటీ ఉందని ఆయన ఆరోపించారు.

ధులేలో ర్యాలీలో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ, బిజెపి నేతృత్వంలోని మహాయుతి కూటమి మహారాష్ట్ర సత్వర అభివృద్ధిని పాధ్యం చేస్తుందని చెప్పారు. ‘మహారాష్ట్రతో నా అనుబంధం గురించి మీ అందరికీ తెలుసు’ అని మోదీ  చెప్పారు. ‘ప్రజలు దేవుడి మరొక రూపం అని మేము పరిగణిస్తుంటాం, కానీ రాజకీయాల్లో కొందరు ప్రజలను దోచుకుంటున్నారు’ అని ప్రధాని ధ్వజమెత్తారు. 

మహారాష్ట్ర ప్రజల నుంచి దేనినైనా తాను కోరినప్పుడల్లా తనకు వారు హృదయపూర్వకంగా తమ ఆశీస్సులు అందజేశారని ఆయన చెప్పారు. ‘గడచిన రెండున్నర సంవత్సరాలుగా మహారాష్ట్ర అభివృద్ధి సాధించిన వేగాన్ని కుంటుపడనివ్వబోమని మీకు హామీ ఇస్తున్నాను’ అని మోదీ  చెప్పారు. 

మహారాష్ట్రకు కావలసిన సత్పరిపాలనను బిజెపి సారథ్యంలోని మహాయుతి ప్రభుత్వం మాత్రమే అందజేయగలదని ప్రధాని స్పష్టం చేశారు. కాంగ్రెస్ కేంద్రంలో, మహారాష్ట్రలో ఒకేసారి అధికారంలో ఉన్నదని, కానీ మరాఠీకి క్లాసికల్ భాష ప్రతిపత్తి ఇవ్వవలసిన అగత్యం ఉందని ఆ పార్టీ ఎన్నడూ భావించలేదని ప్రధాని విమర్శించారు.

 ‘దళితులు, వెనుకబడిన తరగతులు, ఆదివాసీలు పురోగమించడాన్ని కాంగ్రెస్ ఎన్నడూ చూడజాలదు కనుక ఆ పార్టీ ఒక కులంపై మరొక కులాన్ని పోటీకి నిలపడమనే ప్రమాదకర క్రీడలను ఆడుతున్నది’ అని మోదీ  ఆరోపించారు. ‘దేశంలోని ఆదివాసీ సమాజాల మధ్య విభేదాలు సృష్టించడమే కాంగ్రెస్ అజెండా. కాంగ్రెస్ మత వర్గాల మధ్య ఈ కుట్రను ప్రయత్నించినప్పుడు అది దేశ విభజనకు దారి తీసింది” అంటూ నిప్పులు చెరిగారు.

“దేశానికి ఇంతకు మించిన పెద్ద కుట్ర ఏమీ ఉండదు. మీరు సంఘటితంగా ఉన్నంత కాలం మీరు బలంగా ఉంటారు’ అని ప్రధాని మోడీ చెప్పారు. బిజెపికి, మహాయుతికి, మహాయుతిలోని ప్రతి అభ్యర్థికి మీ ఆశీస్సులు అవసరం” అని మోదీ తెలిపారు.