రెండో అతిపెద్ద 5 జి స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌గా భారత్

రెండో అతిపెద్ద 5 జి స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌గా భారత్

ప్రపంచంలోనే భారత్‌ రెండో అతిపెద్ద 5 జి స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌గా అగ్రరాజ్యం అమెరికాను దాటి ఘనత సాధించింది. కౌంటర్‌ పాయింట్‌ రీసెర్చ్‌ తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం  5 జి స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో చైనా మొదటి స్థానంలో ఉంది. ఇది ప్రపంచవ్యాప్తంగా 32 శాతం వాటాను కలిగి ఉండగా, భారత్‌ 13 శాతం వాటాను కలిగి ఉందని నివేదిక తెలిపింది. 

గ్లోబల్‌గా 5 జి మొబైళ్ల వాడకంలో గతేడాదితో పోలిస్తే 2024 మొదటి అర్ధ భాగంలో 20 శాతం పెరిగిందని కౌంటర్‌ పాయింట్‌ రీసెర్చ్‌ నివేదిక తెలిపింది. 5 జి ఫోన్లలో యాపిల్‌ మొబైళ్లను ఎక్కువగా వాడుతున్నారని నివేదిక పేర్కొంది. కౌంటర్‌ పాయింట్‌ రీసెర్చ్‌ నివేదిక ప్రకారం  ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా 5జి మొబైళ్లు వాడుతున్న దేశాల్లో అమెరికా తర్వాత భారత్‌ రెండో స్థానంలో నిలిచింది. 

ఇప్పటివరకు ఈ స్థానంలో ఉన్న చైనాను వెనక్కి నెట్టి భారత్‌ ఒక స్థానం ముందుకు చేరింది. 5 జి ఫోన్లలో ఎక్కువగా యాపిల్‌ మొబైళ్లను వాడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ కేటగిరీలో 25 శాతం కంటే ఎక్కువ వాటా యాపిల్‌ సొంతం చేసుకుంది. ఐఫోన్‌ 15, 14 సిరీస్‌ల్లో ఈ సాంకేతికతను ఎక్కువగా వాడుతున్నారు.

బడ్జెట్‌ విభాగంలో ఎక్కువగా షావోమీ, వివో, శామ్‌సంగ్‌ ఇతర బ్రాండ్‌లకు చెందిన మొబైళ్లను వాడుతున్నారు. 5 జి వాడుతున్నవారిలో 21 శాతం మంది శామ్‌సంగ్‌ గెలాక్సీ ఏ సిరీస్‌, ఎస్‌24 సిరీస్‌లను ఉపయోగిస్తునారు. ఇప్పటికే ఈ టెక్నాలజీ కొన్ని ప్రాంతాల్లో వాడుతున్నా పూర్తిస్థాయిలో ఇంకా దాన్ని వినియోగించడం లేదు. 

4 జి కంటే కొన్ని రెట్ల వేగంతో ఇంటర్నెట్‌ పనిచేస్తుంది. 4 జి లో ఒక సినిమా డౌన్‌లోడ్‌ కావాలంటే కొన్ని నిమిషాలు పడితే.. ఇందులో రెప్పపాటులోనే అల్ట్రా హెచ్‌డీ సినిమాలు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఈ సాంకేతికత అందుబాటులోకి వస్తే వీఆర్‌, ఏఆర్‌ సాంకేతికతలో వేగం పెరగనుంది. భద్రతతో కూడిన రవాణా వ్యవస్థ, రిమోట్‌ ప్రాంతాలకు ఆరోగ్య సేవలు, వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతికత వినియోగం, సరకు రవాణాలో డిజిటల్‌ సేవలు వంటి ఎన్నో అంశాల్లో 5 జి కీలకం కానుంది. రిమోట్‌ ఆధారిత సేవలు అందుబాటులోకి రానున్నాయి.