
కూటమిగా ఏర్పడిన నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ పార్టీలు తమ పార్టీ ఎజెండాలను అనుసరిస్తే తాము పోటీకి దూరంగా ఉంటామని జమ్ముకశ్మీర్ మాజీ సీఎం, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) అధినేత్రి మెహబూబా ముఫ్తీ వెల్లడించారు. అప్పుడు 90 స్థానాల్లో వారే పోటీ చేయాలని చెప్పారు. అయితే ఎన్సీ, కాంగ్రెస్ మధ్య పొత్తు ఏ ఎజెండా ఆధారంగా కాదని, కేవలం సీట్ల పంపకం ప్రాతిపదికన జరిగిందని అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేస్తూ ఆమె విమర్శించారు.
కాగా, పొత్తు, సీట్ల పంపకం చాలా దూరమైన విషయాలని మెహబూబా ముఫ్తీ పేర్కొన్నారు. “నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ మా ఎజెండాను స్వీకరించడానికి సిద్ధంగా ఉంటే, అన్ని స్థానాల్లో పోటీ చేయాలని మేం చెబుతాం. వారిని మేం అనుసరిస్తాం. ఎందుకంటే కశ్మీర్ సమస్య పరిష్కారం కంటే నాకు ఏదీ ముఖ్యం కాదు” అని ఆమె స్పష్టం చేశారు.
“ఇంతకు ముందు కూడా పొత్తు పెట్టుకున్నప్పుడు మాకు ఒక ఎజెండా ఉంది. బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు వాళ్లు అంగీకరించిన ఎజెండా కూడా ఉంది” అని ఆమె గుర్తు చేశారు. అయితే కేవలం సీట్ల పంపకంపై మాత్రమే చర్చలు జరిగితే తమ పార్టీ ఏ కూటమిలోనూ చేరదని ముఫ్తీ స్పష్టం చేశారు.
మరోవైపు పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) లోని హిందూ తీర్థయాత్ర స్థలమైన శారదా పీఠ్కు వెళ్లే మార్గాన్ని తెరువాలని తమ పార్టీ కోరుకుంటోందని మెహబూబా ముఫ్తీ తెలిపారు. అలాగే ఆర్టికల్ 370 రద్దు తర్వాత 2019 నుంచి నిలిపివేసిన సరిహద్దు వాణిజ్యాన్ని పునరుద్ధరించడం కోసం పాకిస్థాన్తో భారత్ చర్చలు జరుపాలని ఆమె కోరారు.
200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, వాటర్ ట్యాక్స్ రద్దు వంటి హామీలను ముఫ్తీ ప్రకటించారు. పేదలకు ఏడాదికి 12 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని ఆమె పేర్కొన్నారు. వృద్ధాప్య, వితంతు పింఛనును రెట్టింపు చేస్తామని వెల్లడించారు. అలాగే జమ్ముకశ్మీర్ కు రాష్ట్ర హోదా పునురుద్ధరిస్తామని తెలిపారు.
మహిళలకు స్టాంప్ డ్యూటీలో మినహాయింపులు, స్థానిక రైతులకు అండగా ఉండేందుకు యాపిల్ పై 100 శాతం దిగుమతి సుంకం విధిస్తామని ప్రకటించారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్ముకశ్మీర్ లో పరిస్థితులు మరింత దిగజారిందని ముఫ్తీ వ్యాఖ్యానించారు. పాకిస్థాన్ తో నియంత్రణ రేఖ వెంబడి ఉన్న ప్రజల మధ్య సత్సంబంధాలు, వాణిజ్యం కోరుకుంటున్నామని ఆమె చెప్పారు.
“జమ్ముకశ్మీర్ ఎన్నికలు సయోధ్య, వాణిజ్యం పునరుద్ధరణ, కశ్మీర్ సమస్య పరిష్కారం కోసం జరుగుతున్నాయి. ఇవే పీడీపీ అజెండాలో ఉన్నాయి. ఈ అజెండాకు కాంగ్రెస్, ఎన్ సీ కూటమి అంగీకారం తెలిపితే పీడీపీ బేషరతుగా మద్దతు ఇస్తుంది” అని ఆమె వెల్లడించారు.
అయితే, పొత్తులపై రాజకీయ చర్చ కశ్మీర్ సమస్యను కేవలం సీట్ల పంపకం, ఎన్నికలకు మాత్రమే పరిమితం చేశారని ఆమె విచారం వ్యక్తం చేశారు. పౌరులు, జర్నలిస్టులకు వ్యతిరేకంగా ప్రజా భద్రతా చట్టం (పీఎస్ఏ), చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం (యుఏపిఎ), సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం (ఏఎఫ్ఎస్పిఏ) వంటి చట్టాల రద్దుకు కృషి చేస్తామని ఆమె ప్రకటించారు.
“అధికారం మా లక్ష్యం కాదు. కశ్మీర్ సమస్యలను పరిష్కరించడమే మా లక్ష్యం. కశ్మీరీల గౌరవం కోసం పోరాడేందుకు కట్టుబడి ఉన్నాం. కశ్మీర్ సమస్య న్యాయబద్ధంగా పరిష్కారమయ్యేలా చూస్తాం. ” అని ముఫ్తీ తెలిపారు.
More Stories
సామాజిక పరివర్తనే లక్ష్యంగా సంఘ శతాబ్ది
డిసెంబర్ 5- 6 తేదీల్లో భారత్కు పుతిన్
దేశీయంగా ఐదోతరం స్టెల్త్ యుద్ధ విమానాల తయారీ