మోదీజీ మీరు పుతిన్‌ను, వారి ఆర్థిక వ్యవస్థను ఆపవచ్చు!

మోదీజీ మీరు పుతిన్‌ను, వారి ఆర్థిక వ్యవస్థను ఆపవచ్చు!
“మీది పెద్ద దేశం. మీ ప్రభావం కూడా చాలా పెద్దగా ఉంటుంది. మీరు పుతిన్‌ను, వారి ఆర్థిక వ్యవస్థను ఆపవచ్చు. నిజంగా వారి స్థానంలో వారిని ఉంచవచ్చు” అంటూ ప్రధాని నరేంద్ర మోదీ యుక్రెయిన్ లో జరిపిన రెండు రోజుల పర్యటన ముగింపు సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు  వోలోడిమిర్ జెలెన్స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు.
 
అంతేకాదు చమురుకు సంబంధించి భారతదేశం, రష్యా మధ్య చాలా ముఖ్యమైన ఒప్పందాలు ఉన్నాయని జెలెన్స్కీ గుర్తు చేశారు. వారి వద్ద చమురు తప్ప ఏమీ లేదని కూడా చెప్పారు. ఉక్రెయిన్‌పై పుతిన్ చేస్తున్న నిజమైన యుద్ధాన్ని భారత్ గుర్తించడం ప్రారంభించిందని తాను భావిస్తున్నట్లు ఆయన తెలిపారు.

ప్రధాని నరేంద్ర మోదీతో భేటీపై మీడియాతో మాట్లాడిన ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ ఇది చాలా మంచి భేటీ అని, ఇది చారిత్రాత్మకమైనదని తెలిపారు. ప్రధాని పర్యటనకు తాను మోదీకి చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు. కొన్ని ఆచరణాత్మక దశలతో ఇది మంచి ప్రారంభమని ప్రస్తావించారు. 

ప్రధాని మోదీకి శాంతిపై ఆలోచనలు ఉంటే, వాటి గురించి మాట్లాడేందుకు సంతోషిస్తామని చెప్పారు. అయితే పుతిన్ కంటే ప్రధాని మోదీ శాంతిని కోరుకుంటున్నారని, కానీ పుతిన్ అలా కోరుకోవడం లేదని స్పష్టం చేశారు. భారత్  ప్రస్తుతం ఆయా దేశాల విషయంలో తన పాత్రను పోషిస్తుందని జెలెన్స్కీ పేర్కొన్నారు.

మరోవైపు ఉక్రెయిన్ జైలులో భారతీయ పౌరులు ఉన్నారనే విషయంపై జెలెన్స్కీ స్పందించారు. ఇక్కడ భారత పౌరులు ఎవరూ లేరని స్పష్టం చేశారు. అలా అయితే వారిని విడుదల చేసి వెంటనే ప్రధాని మోదీకి తెలియజేస్తానని చెప్పారు. ఉక్రెయిన్‌తో జరిగిన యుద్ధంలో రష్యా సైన్యం కోసం పనిచేస్తున్న కొంతమంది భారతీయ పౌరులు మరణించినట్లు మీడియాలో వచ్చిన కథనాలను తాను చదివానని చెప్పారు.

ఇక మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులను కొనుగోలు చేయడం ద్వారా కీవ్‌లో భారతీయ కంపెనీలను కూడా ప్రారంభించవచ్చని జెలెన్స్కీ తెలిపారు. ఈ క్రమంలో ఉక్రెయిన్ నేరుగా భారతదేశంతో నిమగ్నమవ్వడానికి సిద్ధంగా ఉందని ఉక్రెయిన్ అధ్యక్షుడు చెప్పారు. అలాగే భారతదేశంలో కూడా మా కంపెనీలను తెరవడానికి సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. వ్యవసాయం, ఆహార పరిశ్రమ, వైద్యం, సంస్కృతి రంగాలలో సహకారం కోసం రెండు దేశాలు పలు ఒప్పందాలపై సంతకాలు చేశాయి.

కాగా, ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీని భారతదేశాన్ని సందర్శించాలని ఆహ్వానించారు. భారత్‌లో పర్యటించాల్సిందిగా జెలెన్స్కీని ప్రధాని మోదీ ఆహ్వానించినట్లు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ధృవీకరించారు. ఆయన సౌలభ్యం మేరకు ప్రెసిడెంట్ జెలెన్స్కీ ఏదో ఒక సమయంలో భారతదేశాన్ని సందర్శిస్తారని తాము ఆశిస్తున్నామని జైశంకర్ తెలిపారు. 

1992 తర్వాత తొలిసారిగా ప్రధాని ఉక్రెయిన్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా భారత్‌లో పర్యటించాల్సిందిగా జెలెన్స్కీని ఆహ్వానించాల్సిన అవసరం వచ్చిందని పెక్రోన్నారు. దీంతో మూడు దశాబ్దాల క్రితం ఇరు దేశాల మధ్య ఏర్పడ్డ సంబంధాల తర్వాత ఉక్రెయిన్‌లో పర్యటించిన తొలి భారత ప్రధానిగా పీఎం మోదీ రికార్డు సృష్టించారు.