రాష్ట్రపతి పాలనకై ఢిల్లీలో జగన్ ధర్నాకు అఖిలేష్ సంఘీభావం

రాష్ట్రపతి పాలనకై ఢిల్లీలో జగన్ ధర్నాకు అఖిలేష్ సంఘీభావం
ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతున్నదని ఆరోపిస్తూ రాష్ట్రపతి పాలన్ అవిధించాలని డిమాండ్ చేస్తూ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దలేహీలో జంతర్ మంతర్ వద్ద బుధవారం చేపట్టిన ధర్నాకు యుపి మాజీ ముఖ్యమంత్రి, సమాజవాద్ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ సంఘీభావం తెలిపారు.
 
 ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 30 మందికిపైగా వైసీపీ కార్యకర్తలు హత్యకు గురయ్యారని, 300 మందిపై హత్యాయత్నాలు జరిగాయని, 560 చోట్లకు పైగా ప్రైవేటు ఆస్తులు, 490 చోట్లకు పైగా ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేశారని, యథేచ్ఛగా 1000కి పైగా దౌర్జన్యాలు, దాడులు జరిగాయని జగన్ ఆరోపించారు.
 
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలిగించడంతో పాటు టీడీపీ గూండాలు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేశారని, వెయ్యికిపైగా అక్రమ కేసులు పెట్టారని జగన్ విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్‌ మంత్రిగా ఉండి రెడ్‌బుక్‌ పేరిట హోర్డింగ్‌లు పెట్టారని, ఎవరెవరి మీద దాడుల చేయాలి, ఎవరిని ఎలా వేధించాలో అన్ని వివరాలు అందులో రాసినట్టు లోకేష్‌ స్వయంగా ప్రకటించారని గుర్తు చేశారు.

రాష్ట్ర పోలీసులకు కూడా లోకేష్‌ స్పష్టంగా ఆదేశాలు జారీ చేశారని పేర్కొంటూ తమ పార్టీ వాళ్లు దాడులు, ఆస్తుల విధ్వంసం చేసినా, ఏ చర్యా తీసుకోవద్దని నిర్దేశించారని ఆరోపించారు. ఏపీలో ఇప్పుడు భారత రాజ్యాంగం కాకుండా, రెడ్‌బుక్‌ రాజ్యాంగం పని చేస్తోందని జగన్ ఆరోపించారు. గిట్టనివారి పంటలను కూడా నాశనం చేశారని వెల్లడించారు. వందల ఇండ్లను, గిట్టనివారి పంటలను కూడా ధ్వంసం చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. 

 
తమ హయాంలో ఏనాడూ ఇలాంటి దాడులు, దౌర్జన్యాలను ప్రోత్సహించలేదని స్పష్టం చేశారు. లోకేశ్‌ రెడ్‌బుక్‌ పేరుతో హోర్డింగులు పెట్టారని చెప్పారు.
ఏపీలో జరుగుతున్న హింసాత్మక చర్యలను అఖిలేష్ ఖండించారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని ఆంధ్రప్రదేశ్‌ ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించేందుకే టీడీపీ చర్యలు ఉన్నాయని అఖిలేశ్‌ అభిప్రాయపడ్డారు.

రాజకీయాల్లో గెలుపు, ఓటములు సహజం అంటూ  అధికారంలో ఉన్నవారు సంయమనం పాటించాలని హితవు పలికారు. ప్రజల సమస్యలు పట్టించుకోవాలని, ఎదుటివారు చెప్పేది వినాలి. అంతేకానీ, వారి ప్రాణాలు తీయకూడదని స్పష్టం చేశారు.