
గత 3-4 ఏళ్లలో దేశంలో 8 కోట్ల కొత్త ఉద్యోగాలు సృష్టించినట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఆర్బీఐ స్వయంగా ఈ గణాంకాలు వెల్లడించిందన్న మోదీ, ఉద్యోగ కల్పనపై తప్పుడు కథనాలను ప్రచారం చేసే వారి నోర్లు మూతబడ్డాయని పేర్కొన్నారు. ముంబయిలోని గోరేగావ్లో పర్యటించిన ప్రధాని ఆ రాష్ట్రంలో రోడ్డు, రైల్వే, ఓడరేవు రంగాల్లో రూ.29,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. దేశంలో నైపుణ్యాభివృద్ధి, ఉపాధి దిశగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు.
ముంబయితో పాటు పరిసర ప్రాంతాల్లో రానున్న మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ఆయా ప్రాంతాల్లో కనెక్టివిటీని పెంచుతాయని వివరించారు. చిన్నపెద్దా తేడా లేకుండా పెట్టుబడిదారులంతా తమ ప్రభుత్వం మూడో దఫాను ఉత్సాహంతో స్వాగతించారన్నారు. మహారాష్ట్రను ప్రపంచంలోనే పెద్ద ఆర్థిక శక్తిగా, ముంబయిని ప్రపంచ ఫిన్టెక్ రాజధానిగా మార్చడం తమ లక్ష్యమని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా ముంబైలో రూ. 956 కోట్లతో చేపట్టనున్న బహుళ రైల్వే ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. పలు అభివృద్ధి పనులను దేశానికి అంకితం చేశారు. టర్బేలో కళ్యాణ్ యార్డ్ పునర్నిర్మాణం, గతి శక్తి మల్టీ మోడల్ కార్గో టెర్మినల్ కు ప్రధాని శంకుస్థాపన చేశారు. లోకమాన్య తిలక్ టెర్మినస్లో నిర్మించిన కొత్త ప్లాట్ఫారమ్, ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్లో విస్తరించిన 10, 11 ప్లాట్ఫారమ్ లను ప్రధాని దేశానికి అంకితం చేశారు.
ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర గవర్నర్ రమేష్ బైస్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, కేంద్ర సామాజిక శాఖ సహాయ మంత్రి రాందాస్ అథవాలే, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ పాల్గొన్నారు.
ప్రధాని శంకుస్థాపన చేసిన కళ్యాణ్ యార్డ్ పునర్నిర్మాణ పాజెక్ట్ కు – రూ.813 కోట్లు వ్యయం కానుంది. కళ్యాణ్ రైల్వే స్టేషన్ ముంబై ప్రాంతంలో రద్దీగా ఉండే ప్రధాన రైల్వే స్టేషన్లలో ఒకటి. ఈ యార్డ్ పునర్నిర్మాణం వల్ల సుదూర, సబర్బన్ ట్రాఫిక్ను వేరు చేయడంలో సహాయపడుతుంది. గూడ్స్ యార్డ్ ఏకీకరణ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది.
ప్రతిరోజూ లక్షల మంది ప్రయాణికులకు అతుకులు లేని కనెక్టివిటీని అందజేస్తుంది. మరిన్ని రైళ్లను నిర్వహించడానికి యార్డ్ సామర్థ్యాన్ని పెంచుతుంది, రద్దీని తగ్గిస్తుంది. రైలు కార్యకలాపాల సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది.
గతి శక్తి మల్టీ మోడల్ కార్గో టెర్మినల్ ప్రాజెక్ట్ ను రూ.26.80 కోట్ల వ్యయంతో చేపట్టనున్నారు. దీని వల్ల స్థానిక ప్రజలకు అదనపు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. సరుకు రవాణా ద్వారా ఆదాయం పెరుగుతుంది. సిమెంట్, ఇతర వస్తువుల నిర్వహణ కోసం సౌలభ్యం ఏర్పడుతుంది. లోకమాన్య తిలక్ టెర్మినస్ వద్ద కొత్త ప్లాట్ఫారమ్లను ప్రధాని జాతికి అంకితం చేశాఉ. ఈ ప్రాజెక్టును రూ.64 కోట్లతో చేపట్టారు. ఈ ప్రాజెక్ట్ ఇటీవలే పూర్తయింది. పొడవైన ప్లాట్ఫారమ్లు పొడవైన రైళ్లకు వసతి కల్పిస్తాయి.
ఒక్కో రైలుకు ఎక్కువ మంది ప్రయాణికులను అనుమతించడంతోపాటు పెరిగిన ట్రాఫిక్ను నిర్వహించడానికి స్టేషన్ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. విస్తరించిన ప్లాట్ఫారమ్లు ప్రయాణీకులు ఎక్కడానికి, దిగడానికి ఎక్కువ స్థలాన్ని అందిస్తాయి, రద్దీని తగ్గిస్తాయి. ప్రయాణీకుల ప్రవాహాన్ని మెరుగుపరుస్తాయి.
More Stories
జీఎస్టీ సంస్కరణలు పొదుపు పండుగ లాంటిది
టీటీడీ పరకామణిలో ఫారిన్ కరెన్సీ దోపిడీపై సీఐడీ దర్యాప్తు
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఏబీవీపీ ఘనవిజయం