
లోక్సభ ఎన్నికల ఏడోది, చివరివిడత పోలింగ్కు సర్వం సిద్ధమైంది. జూన్ 1న 8రాష్ట్రాల్లోని 57 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. ఇందులో ఉత్తర్ప్రదేశ్, పంజాబ్లో 13 చొప్పున స్థానాలు ఉన్నాయి. బంగాల్లో 9, బిహార్ 8, ఒడిశా 6, హిమాచల్ ప్రదేశ్ 4, ఝార్ఖండ్ 3, కేంద్రపాలిత ప్రాంతం చండీగఢ్లోని ఒకచోట పోలింగ్ జరగనుంది.
ఏడోవిడత ఎన్నికల బరిలో వివిధపార్టీల తరఫున 904మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. పంజాబ్లో అత్యధికంగా 328మంది, ఆ తర్వాత వరుసగా యూపీలో 144 మంది, బిహార్ 134, ఒడిశా 66, ఝార్ఖండ్ 52, హిమాచల్ 37, చండీగఢ్లో 19మంది అభ్యర్థులు తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు.
ఏడు విడత లోక్ సభ ఎన్నికల్లో ముఖ్యంగా ఐదు స్థానాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అందులో మొదటిది ప్రధాని నరేంద్ర మోదీ పోటీ చేస్తున్న వారణాసి. ఆయన ప్రత్యర్థిగా కాంగ్రెస్ తరఫున అజయ్ రాయ్ పోటీ చేస్తున్నారు. 2014, 2019 ఎన్నికల్లో వారణాసి నుంచి రెండుసార్లు విజయం సాధించిన మోదీ, ఇప్పుడు మూడోసారి జయకేతనం ఎగురవేసి హ్యాట్రిక్ సాధించాలని భావిస్తున్నారు.
కాంగ్రెస్ అభ్యర్థి అజయ్రాయ్ 2012లో బీజేపీకి రాజీనామా చేసి హస్తం గూటికి చేరారు. ఉత్తర్ప్రదేశ్ గోరఖ్పుర్లో సినీనటుల మధ్య పోటీ నెలకొంది. బీజేపీ తరఫున భోజ్పురీ నటుడు రవికిషన్, నటి కాజల్ నిషాద్ సమాజ్వాదీ పార్టీ నుంచి బరిలో నిలిచారు. అందరి దృష్టిని ఆకర్షిస్తున్న మరో నియోజకవర్గం హిమాచల్ప్రదేశ్లోని మండి. అక్కడ రాజు, రాణి మధ్య పోటీ నెలకొన్నట్లు ప్రచారం జరుగుతోంది. బాలీవుడ్ నటి, క్వీన్ కథానాయిక కంగనా రనౌత్ బీజేపీ తరఫున బరిలో ఉన్నారు. ఆమె తొలిసారి ఎన్నికల బరిలో నిలిచారు.
మండి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా గుర్తింపు పొందింది. ఇక్కడి నుంచి ఆ పార్టీ తరఫున రాజకుటుంబానికి చెందిన విక్రమాదిత్యసింగ్ రంగంలో ఉన్నారు. ఆయన మాజీ సీఎం వీరభద్రసింగ్, హిమాచల్ ప్రదేశ్ పీసీసీ చీఫ్ ప్రతిభాదేవి సింగ్ దంపతుల కుమారుడు. హిమాచల్ ప్రదేశ్లోని హమీర్పుర్లో కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్తో కాంగ్రెస్ అభ్యర్థి సత్పాల్ సింగ్ రాయ్జాదా తలపడుతున్నారు. అనురాగ్ ఠాకూర్ ఇక్కడి నుంచి ఇప్పటివరకు వరుసగా 3సార్లు ఎంపీగా గెలుపొందారు.
బంగాల్లోని డైమండ్ హార్బర్ లోక్సభ నియోజకవర్గంలో సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ పోటీలో ఉన్నారు. తృణమూల్ కాంగ్రెస్కు వ్యూహాత్మకంగా కీలకమైన ఈ స్థానంలో త్రిముఖ పోటీ నెలకొంది. సీపీఎం నుంచి ప్రతికూర్ రహమాన్, బీజేపీ తరఫున అభిజిత్ దాస్ బరిలో ఉన్నారు. బంగాల్ ఎన్నికలు కూడా ఉత్కంఠ రేపుతున్నాయి.
ఇక్కడ తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. 2019 ఎన్నికల్లో టీఎంసీ 22 స్థానాల్లో గెలుపొందగా బీజేపీ 18 సీట్లు దక్కించుకుంది. ఈసారి బీజేపీ అత్యధిక స్థానాలు గెలుపొందే రాష్ట్రాల్లో బంగాల్ మొదటి స్థానంలో ఉంటుందని కమలనాథులు చెప్పటం వల్ల ఉత్కంఠ నెలకొంది. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో ముగ్గురు ఎమ్యెల్యేలు ఉన్న బీజేపీని 2021లో ప్రధాని మోదీ 77 స్థానాల్లో గెలిపించారని ఉదహరిస్తున్నారు.
పంజాబ్లో ఇండియా కూటమిలోని కాంగ్రెస్, ఆప్ మధ్యే ప్రధానంగా పోటీ నెలకొంది. ఇతర రాష్ట్రాల్లో కలిసి పనిచేస్తున్న ఈ రెండు పార్టీలు అక్కడ కత్తులు దూస్తున్నాయి. 2019 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 8 చోట్ల గెలుపొందింది. బీజేపీ 2, శిరోమణి అకాలీదళ్ 2, ఆప్ ఒక స్థానాన్ని నిలబెట్టుకున్నాయి. అయితే 2022లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ బలం ఒక్కసారిగా పెరిగింది. 117శాసనసభ స్థానాలు ఉండగా ఆప్ 92 సీట్లతో అధికారం కైవసం చేసుకుంది. కాంగ్రెస్ 18చోట్ల విజయం సాధించింది.
More Stories
మాజీ డీఎస్పీ నళినిని పరామర్శించిన బిజెపి బృందం
నవంబర్ 5 నుంచి 15 వరకు బీహార్ అసెంబ్లీ ఎన్నికలు!
పాలస్తీనాను గుర్తించిన బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా