అమెరికాలో రోడ్డు ప్రమాదంలో తెలంగాణ విద్యార్థిని మృతి

అమెరికాలో రోడ్డు ప్రమాదంలో తెలంగాణ విద్యార్థిని మృతి

ఉన్నత చదువులు చదివి తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చేందుకు ఓ విద్యార్థిని రెండు సంవత్సరాల క్రితం అమెరికా వెళ్లింది. అనుకున్నట్లే ఎమ్మెస్ పూర్తి చేసి సర్టిఫికెట్​ సంపాదించుకుంది. ఇక ఉద్యోగం సంపాదించి తల్లిదండ్రులకు ఆసరాగా ఉందామనుకొనే లోపు విషాదం చోటు చేసుకుంది.  అమెరికాలో ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న ఆ విద్యార్థిని ఓ రోడ్ ప్రమాదంలో మృతి చెందింది. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తన కుమార్తె మృతదేహాన్ని త్వరగా తమ వద్దకు పంపించాలని అధికారులను వేడుకుంటున్న తీరు చూసి స్థానికులను కంటతడి పెట్టిస్తోంది.

కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరి గుట్ట పట్టణం యాదగిరి పల్లికి చెందిన గుడ్ల కోటేశ్వర్ రావు కుమార్తె సౌమ్య (25) రెండు సంవత్సరాల క్రితం ఎమ్మెస్ చేసేందుకు అమెరికా వెళ్లింది. ఎమ్మెస్ పూర్తి చేసుకుని ఇటీవలే భారతదేశానికి వచ్చి కుటుంబ సభ్యులతో కొన్ని గడిపి మళ్లీ విద్యార్థి వీసా మీద అమెరికాకు వెళ్లింది.

అమెరికాలో పార్ట్​ టైం ఉద్యోగం చేసకుంటూ శాశ్వత ఉద్యోగ ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఆదివారం ఆమె కూరగాయలు కొనేందుకు షాపునకు వెళ్లింది. తిరిగి వస్తున్న క్రమంలో ఓ కారు వేగంగా వచ్చి ఢీ కొట్టింది. దీంతో సౌమ్య అక్కడికక్కడే మృతి చెందింది.  ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరు పెట్టుకున్నారు. తన మృతదేహాన్ని వెంటనే ఇక్కడకు పంపించాలని భారత రాజకీయ కార్యాలయ సిబ్బందిని వేడుకున్నారు.
 
“మా అమ్మాయి సౌమ్య 2022 ఆగస్టులో ఉన్నత చదువులు చదివేందుకు అమెరికాకు వెళ్లింది. ఎమ్మెస్ చదివేసి సర్టిఫికెట్​ తీసుకుంది. ప్రస్తుతం ఉద్యోగ ప్రయత్నంలో ఉంది. రాత్రి కూరగాయలు కొనేందుకు షాప్​కి వెళ్లి తిరిగి వస్తుండగా కారు గుద్దిందని అక్కడ ఉన్న వ్యక్తుల ద్వారా తెలుసుకున్నాం. ఏం జరిగిందో ఏమైందో మాకు పూర్తిగా తెలియడం లేదు. మా అమ్మాయి మృతదేహాన్ని త్వరగా మా దగ్గరకి పంపించాలని ఇండియన్​ అంబాసిడర్​ను వేడుకుంటున్నాం.​” అని సౌమ్య తండ్రి గుడ్ల కోటేశ్వర్ రావు విలపిస్తున్నారు.