విశాఖ డ్రగ్స్ కేసుకు సంబంధించి సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ కంపెనీలో నలుగురు ప్రతినిధులకు సిబిఐ నోటీసులు జారీ చేసింది. విశాఖ పోర్టులో భారీగా డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ డ్రగ్స్ కేసుపై సిబిఐ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ కేసు విచారణలో భాగంగా తాజాగా సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ కంపెనీలో నలుగురు ప్రతినిధులకు సిబిఐ నోటీసులు ఇచ్చింది.
కంపెనీకి సంబంధించి పూర్తి స్థాయిలో డేటా కావాలని నోటీసుల్లో సీబీఐ పేర్కొంది. మరోవైపు ఎపిలో పలువురు ఆక్వా వ్యాపార ప్రతినిధులను కూడా సిబిఐ అధికారులు ప్రశ్నించనున్నారు. పెద్ద మొత్తంలో ఈస్ట్ ఆర్డర్ చేసుకోవడంలో ఆంతర్యమేంటనే దానిపై ప్రశ్నలు సంధించనున్నట్టు తెలుస్తుంది. మరోవైపు సిబిఐ అడిగిన ప్రశ్నలకు సంధ్య ఆక్వా ఇప్పటి వరకు ఎలాంటి సమాధానం ఇవ్వలేదు.
తమ సంస్థ తీసుకొచ్చిన డ్రైఈస్ట్లో డ్రగ్స్ ఎలా వచ్చాయో తమకు తెలియదని సంధ్యా ఆక్వా సంస్థ చెబుతోంది. ఈ వ్యవహారంపై నిగ్గు తేల్చేందుకు సిబిఐ విచారణ వేగవంతం చేసింది. ఇటీవల మరికొన్ని బ్యాగుల్ని పరీక్షించగా 70 శాతం డ్రైఈస్ట్ బ్యాగుల్లో డ్రగ్స్ ఆనవాళ్లు ఉన్నట్లు తెలిసింది.
ఈ తరుణంలో సంధ్యా ఆక్వా యాజమాన్యాన్ని సిబిఐ విచారిస్తోంది. ఎప్పటినుంచి వ్యాపార లావాదేవీలు సాగిస్తున్నారు? బ్రెజిల్ నుంచి ఫీడ్ని ఎప్పుడు బుక్ చేశారు? అక్కడి నుంచి తెప్పించుకోడానికి గల కారణాలేంటి?విశాఖ పోర్ట్నే ఎందుకు ఎంచుకున్నారు? ఇంత భారీగా తెప్పించుకున్న సరుకును నిర్ణీత వ్యవధిలో ఎలా విక్రయిస్తారు ? తదితర విషయాలపై సిబిఐ ప్రశ్నించనున్నట్లు సమాచారం.
సంధ్య ఆక్వా యాజమాన్యం కాల్ డేటాపై సిబిఐ దృష్టి సారించింది. అలాగే, విశాఖ పోర్టులో కస్టమ్స్ కార్యకలాపాలపై కూడా నిఘా పెట్టింది. డ్రగ్ కంటైనర్ తనిఖీలకు వచ్చిన సిబిఐకి ముందుగా ఆశించిన సహకారం లభించలేదని సమాచారం. పోర్ట్ నుంచి సీఎఫ్ఎస్కు వెళ్లే కంటైనర్ల తనిఖీలకు అనుసరించే విధానంపై సిబిఐ ఆరా తీస్తోంది. కస్టమ్స్ పనితీరులో లోపాలు నిర్ధారణ జరిగితే ప్రత్యేకంగా ప్రస్తావించే అవకాశం ఉంది.
ఈ క్రమంలో ఈ కంపెనీకి చెందిన ఓ బస్సు కాకినాడ జిల్లాలో రోడ్డు పక్కన అనుమానాస్పదంగా ఉండడాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడకు వెళ్లి బస్సులో తనిఖీలు చేసి, అందులో కొన్ని చెక్బుక్లు, రికార్డులు ఉండడాన్ని గుర్తించారు. బస్సును పోలీ్సస్టేషన్కు తీసుకెళ్లకుండా పోలీసులు సంధ్యా కంపెనీకి తిరిగి అప్పగించారు. అసలు స్వాధీనం చేసుకున్న రికార్డుల్లో ఏం సమాచారం ఉందో, అవి వేటికి చెందినవో పూర్తిస్థాయిలో పరిశీలించకుండా బస్సును వదిలేయడంపై పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
More Stories
ఏపీలో 6.2 శాతం పెరిగిన ఓటింగ్
పిన్నెల్లి జూన్ 6 వరకు మాచర్లకు వెళ్లొద్దని హైకోర్టు ఆంక్షలు
ప్రధాని విజయవాడ పర్యటనలో భద్రతా వైఫల్యంపై కేంద్రం సీరియస్