వైసీపీకి, మంత్రి పదవికి గుమ్మనూరు జయరాం రాజీనామా చేసి, అదేరోజు సాయంత్రం టిడిపిలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 12 ఏళ్ల నుంచి వైసీపీ జెండా మోశానని, రెండు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నానని, మంత్రి పదవి చేశానని తెలిపారు. ఆలూరు ప్రజల మనోభావాలకు అనుగుణంగా వైసీపీని వీడుతున్నట్లు చెప్పారు. చంద్రబాబు సమక్షంలో జయహో బీసీ సదస్సులో టీడీపీలో చేరుతున్నానని గుమ్మనూరి ప్రకటించారు.
మంగళవారం సాయంత్రం ‘జయహో బీసీ’ సభలో చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. గత కొంతకాలంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనుసరిస్తున్న విధానాలపై అసంతృప్తితో ఉన్న జయరాంకు ఆలూరు వైసీపీ టికెట్ మళ్లీ ఇవ్వలేదు. కర్నూలు లోక్సభ స్థానం నుంచి పోటీచేయాలని జగన్ సూచించారు. అసెంబ్లీకే పోటీచేస్తానని పట్టుబట్టినా పట్టించుకోలేదు.
దీంతో జయరాం టీడీపీ నాయకత్వంతో సంప్రదింపులు జరిపి ఆ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. మంగళవారం ఉదయం వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి, మంత్రి పదవికి రాజీనామా చేస్తూ ముఖ్యమంత్రికి లేఖను మీడియా ప్రతినిధుల ముందే పంపారు. అయితే, ఆయన రాజీనామాను జగన్ ఆమోదించకుండా ఆయన్ను బర్తరఫ్ చేయాలని గవర్నర్ అబ్దుల్ నజీర్కు సిఫారసు చేశారు. దీంతో గవర్నర్ ఆయన్ను కేబినెట్ నుంచి తొలగించారు. ఈ మేరకు రాజ్భవన్ గెజిట్ విడుదల చేసింది.
‘‘సీఎం జగన్ నా.. నా.. అంటున్నారు.. కానీ ఉమ్మడి కర్నూలు జిల్లాలో బీసీలకు న్యాయం జరగలేదన్నారు. ఓ బోయను.. ఓ ఎస్సీ.. ఓ ముస్లింలను తీసేశారు. 2022 తర్వాత జగన్ను ఓ దేవుడిగానే చూశాను. 2022. తర్వాత జగన్ విగ్రహంగా మారారు. ఆ విగ్రహానికి సజ్జల, ధనుంజయ్ రెడ్డిలు పూజారులు. పూజారులు వాళ్ల కొడుకులకే న్యాయం చేస్తున్నారు. కానీ.. భక్తులకు న్యాయం చేయడం లేదు’’ అని గుమ్మనూరి జయరాం ధ్వజమెత్తారు.
ఆలూరు నియోజకవర్గంలోనే ఉండాలని కోరుకున్నానని, ఎంపీ పదవి వద్దన్నానని తెలిపారు. తన నియోజకవర్గం ప్రజలు కూడా ఇక్కడే ఉండాలని కోరుకుంటున్నారని గుమ్మనూరు చెప్పారు. తమ కులం ఎక్కువగా రెండు జిల్లాల్లోనే ఉందని చెబుతూ గుంతకల్ నుంచి పోటీ చేయడానికి తాను సుముఖంగా ఉన్నానని తెలిపారు.
తన సొంతూరు గుంతకల్ దగ్గర్లోనే ఉందని, కాబట్టి తాను గుంతకల్ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నాని చెప్పారు. కర్ణాటకలో తన సోదరుడు మంత్రిగా ఉన్నారంతేనని, తానేమీ కాంగ్రెస్ పార్టీతో టచ్లో లేనని స్పష్టం చేశారు.
More Stories
జూన్ 1 వరకు సీఎం జగన్ విదేశీ పర్యటన
ఏపీలో పోలింగ్ ముగిసినా పలుచోట్ల హింసాత్మక ఘటనలు
కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకుండా జగన్ ను అడ్డుకోండి!