తెలంగాణాలో నావికాదళం రాడార్ స్టేషన్

తెలంగాణాలో నావికాదళం రాడార్ స్టేషన్
భారత నావికా దళం దేశంలోనే రెండో వీఎల్ఎఫ్ కమ్యూనికేషన్ స్టేషన్‌ను వికారాబాద్ జిల్లాలో నెలకొల్పబోతున్నది. నౌకలు, జలాంతర్గాములతో సంభాషించేందుకు నావికాదళం వీఎల్ఎఫ్ (వెరీ లో ఫ్రీక్వెన్సీ) కమ్యూనికేషన్ ట్రాన్స్ మిషన్ స్టేషన్‌ను ఏర్పాటు చేయనున్నది. వికారాబాద్ మండలం పూడూరు సమీపంలోని దామగూడెం అటవీ ప్రాంతంలో ఈ స్టేషన్ ఏర్పాటు చేయనుంది. 
 
దేశంలోనే ఇది రెండో స్టేషన్ కావడం విశేషం. తమిళనాడులోని తిరునెల్వేలిలో ఉన్న ఐఎన్ఎస్ కట్టబొమ్మన్ రాడార్ స్టేషన్ మొదటిది. 1990 నుంచి అది నావికా దళానికి సేవలందిస్తోంది. రెండో రాడార్ స్టేషన్ ఏర్పాటుకు తెలంగాణ అనువైన ప్రాంతంగా విశాఖపట్నంలోని తూర్పు నౌకాదళ కమాండ్ గుర్తించింది.  2010 నుంచి నావికా దళం తెలంగాణ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతోంది. 
పర్యావరణ అనుమతులు, క్లియరెన్స్‌ వచ్చాయి. 
 
తాజాగా కమోడోర్ కార్తీక్ శంకర్, సర్కిల్ డీఈవో రోహిత్ భూపతి, కెప్టెన్ సందీప్ దాస్ బుధవారం సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. వికారాబాద్ డీఎఫ్‌వో, నావల్ కమాండ్ ఏజెన్సీ అధికారులు అటవీ భూముల బదిలీ ఒప్పందంపై సంతకాలు చేశారు. దామగూడెం రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో ఉన్న 1,174 హెక్టార్ల అటవీ భూమిని నేవీకి అప్పగించారు. 
 
2014లోనే కేంద్ర అటవీ పర్యావరణ శాఖ నేవీ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. అటవీ భూమి అప్పగించేందుకు రూ.133.54 కోట్ల కాంపా నిధులు, భూసంరక్షణ చర్యలకు చేపట్టే పనులకు రూ.18.56 కోట్లను నేవీ చెల్లించింది. ఈ ప్రాజెక్టును రద్దు చేయాలని కోరుతూ దామగూడెం ఫారెస్ట్ ప్రోటెక్షన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం నిర్ణయించిన షరతులకు అనుగుణంగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 
 
ప్రతిపాదించిన అటవీ ప్రాంతంలో ఓ ఆలయం ఉంది. దీనికి ఇబ్బంది తలెత్తకుండా చూడడం, ఇతరులను అనుమతించేందుకు నేవీ అంగీకరించింది. ఇక్కడ నేవీ స్టేషన్‌తో పాటు ఏర్పడే టౌన్‌షిప్‌లో స్కూల్స్‌, హాస్పిటల్స్‌, బ్యాంకులు, మార్కెట్లు ఉండనున్నాయి. ఈ నేవీ యూనిట్‌ దాదాపు 600 మంది నావికాదళంతో పాటు ఇతర సాధారణ పౌరులు సైతం ఉంటారు. 
 
దాదాపు 2500 నుంచి 3000 మంది ఈ టౌన్‌షిప్‌లో నివసించనున్నారు. విస్తృతంగా మొక్కలు నాటి పెంచడం ద్వారా ఈ ప్రాంతంలో జీవవైవిధ్యం, పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు తగిన చర్యలు చేపట్టనున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగానే దామగుండం రిజర్వ్ ఫారెస్ట్ చుట్టూ దాదాపు 27 కిలోమీటర్ల రోడ్డు వేయనున్నారు. 2027 నాటికి వీఎల్ఎఫ్ సెంటర్ పనులన్నీ పూర్తయి అందుబాటులోకి వస్తుంది.