చంద్రబాబుపై బెయిల్ ఆంక్షలను తేల్చి చెప్పిన  సుప్రీంకోర్టు 

చంద్రబాబుపై బెయిల్ ఆంక్షలను తేల్చి చెప్పిన  సుప్రీంకోర్టు 
స్కిల్ డెవలప్‌మెంట్ కేసు వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి నవంబరు 20న హైకోర్టు సాధారణ బెయిల్‌ను మంజూరు చేస్తూ ఈ కేసుకు సంబందించి ఎటువంటి వాఖ్యలు చేయకుండా విధించిన ఆంక్షలను సుప్రీంకోర్టు కొనసాగించింది. అయితే ఆయన రాజకీయ కార్యకలాపాలపై ఆంక్షలు విధించేందుకు నిరాకరించింది. 
 
హైకోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని సవాల్ చేస్తూ ఏపీ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం
రాజకీయ ర్యాలీలు, సభలు, సమావేశాలూ నిర్వహించకుండా చంద్రబాబును కట్టడి చేయాలన్న సీఐడీ అభ్యర్ధనను సుప్రీం తోసిపుచ్చింది.  స్కిల్ కేసు గురించి మాత్రమే చంద్రబాబు బహిరంగంగా వ్యాఖ్యలు చేయరాదని సుప్రీం తేల్చిచెప్పింది.
ఇరుపక్షాలూ స్కిల్ కేసు గురించి బహిరంగంగా వ్యాఖ్యానాలు చేయరాదని పేర్కొంది. రాజకీయ ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించుకోవడానికి చంద్రబాబుకు అనుమతినిచ్చింది.  రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ బేలా ఎం త్రివేది, జస్టిస్‌ సతీష్‌ చంద్ర శర్మ  ధర్మాసనం విచారణ చేపట్టారు. చంద్రబాబుకు బెయిల్‌ మంజూరులో తమ వాదనలు ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోలేదని పిటిషన్‌లో ప్రభుత్వం పేర్కొంది.
తాము చెప్పిన ఏ విషయాన్ని హైకోర్టు పట్టించుకోలేదని పిటిషన్‌ దాఖలు చేసిన తర్వాత ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదించారు.  హైకోర్టు తన పరిధి దాటి తీర్పులో వ్యాఖ్యలు చేసిందని.. వెంటనే చంద్రబాబు బెయిల్‌ రద్దు చేయాలని ఏపీ సర్కార్ కోరింది.  బహిరంగ సభలో పాల్గొనడంపై న్యాయవాది  ప్రస్తావించగా జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం స్పందిస్తూ మొదటి భాగం (సబ్ జ్యుడీషియల్ కేసు గురించి పబ్లిక్ డొమైన్‌లో మాట్లాడకుండా షరతు విధించడం) అలాగే కొనసాగుతుంది.
కానీ, ఆయన బహిరంగ సమావేశాలు, ర్యాలీలలో పాల్గొనవచ్చు అని అన్నారు. అయితే, కేసు వివరాలు గురించి ఎక్కడా మాట్లాడవద్దని న్యాయమూర్తి సూచించారు. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకూ ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని వివరించారు.  పైగా, ఈ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటీషన్ 17 ఏపై తీర్పు వచ్చిన తరువాత మాత్రమే  చంద్రబాబు బెయిల్ రద్దు కేసు వింటామని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది.  ఇప్పటికే క్వాష్ పిటీషన్ పై సుప్రీంకోర్టులో వాదనలు పూర్తికాగా తీర్పును రిజర్వ్ చేశారు.