
అసెంబ్లీ తీర్మానించిన బిల్లులకు ఎలాంటి కారణాలు చెప్పకుండా గవర్నర్ ఆర్ ఎన్ రవి వెనక్కి పంపిన బిల్లులను మరోసారి శనివారం తమిళనాడు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. తాజాగా ఆమోదం పొందిన బిల్లుల్లో 2020, 2023 లో అసెంబ్లీ తీర్మానించిన రెండేసి బిల్లులు ఉండగా, మరో ఆరు బిల్లులు 2022 లోనే ఆమోదించినవి ఉన్నాయి.
ఇందులో వైస్ ఛాన్సలర్ నియామకంలో గవర్నర్ అధికారాలను తొలగించేలా తీసుకొచ్చిన తీర్మానం కూడా ఉంది. వర్మిటీల వీసీలను రాష్ట్ర ప్రభుత్వమే నియమించేలా తమిళనాడు విశ్వవిద్యాలయాల చట్టంలో సవరణలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ బిల్లు తీసుకొచ్చింది.
బిల్లులపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి ఎం కె స్టాలిన్ మాట్లాడుతూ గవర్నర్పై విమర్శలు గుప్పించారు. ఎలాంటి కారణం చూపకుండా బిల్లులను నిలిపివేయడం ఆమోద యోగ్యం కాదని పేర్కొన్నారు. “కేవలం ఆయన వ్యక్తిగత కారణాల తోనే బిల్లులకు ఆమోదం తెలపకుండా వెనక్కి పంపారు. ఇది అప్రజాస్వామికం, ప్రజావ్యతిరేకం” అని స్టాలిన్ తెలిపారు.
తమిళనాడులో అధికార డిఎంకే ప్రభుత్వానికి, గవర్నర్ ఆర్ఎన్ రవికి గత కొంతకాలంగా పొసగడం లేదు. జనవరి 4న చెన్నైలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో గవర్నర్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే లేపాయి. “దేశం మొత్తానికి వర్తించేదాన్ని తమిళనాడు ప్రభుత్వం మాత్రం కాదని చెబుతోంది. ఇది ఓ అలవాటుగా మారిపోయింది” అంటూ తీవ్రంగా వ్యాఖ్యానించారు.
అప్పటి నుంచి మొదలైన వివాదం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అసెంబ్లీ తీర్మానించిన బిల్లులను పెండింగ్లో ఉంచడంతో తమిళనాడు ప్రభుత్వం సుప్రీం కోర్టును కూడా ఆశ్రయించింది. దీనిపై నవంబర్ 10 న విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం గవర్నర్ తీరుపై అసహనం వ్యక్తం చేసింది. 12 బిల్లుల పెండింగ్కు సంబంధించి తమిళనాడు ప్రభుత్వం చేస్తోన్న ఆరోపణలపై ప్రతిస్పందన తెలపాలని, కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశ పరిచి గత బిల్లులను ఆమోదించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
More Stories
సామ్ పిట్రోడా పాకిస్థాన్ వ్యాఖ్యలపై రాజకీయ చిచ్చు
ప్రెస్ మీట్ లో ఫోన్ నెంబర్ ఇచ్చి చిక్కుల్లో రాహుల్!
ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికల్లో ఎబివిపి ఘన విజయం