కులగణనను రాజకీయం చేసిన నితీశ్‌కుమార్ ప్రభుత్వం

కులగణనను రాజకీయం చేసిన నితీశ్‌కుమార్ ప్రభుత్వం

బీహార్‌లో జరిగిన కులగణనను రాష్ట్రంలోని నితీశ్‌కుమార్ ప్రభుత్వం రాజకీయం చేసిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా విమర్శించారు. ఇక్కడ ఆర్బాటంగా చేపట్టిన కులగణనలో ఉద్ధేశపూరితంగా కావాలనే ముస్లింలు, యాదవ్‌ల జనాభా పెరిగినట్లు చూపారని, ఇది కేవలం ఆ వర్గాల ప్రసన్నతకు చేపట్టిన మెచ్చుకోళ్ల రాజకీయం అని అమిత్ షా మండిపడ్డారు. 

ముజఫర్‌పూర్‌లోని పటాహీలో ఆదివారం జరిగిన సభలో బిజెపి నేత అమిత్ షా ప్రసంగిస్తూ ఇంతకూ రాష్ట్రంలో కులగణన నిర్వహించాలని, కులాల వారిగా ఆర్థిక సామాజిక స్థితిగతులను అధ్యయనం చేయాలని గతంలో నిర్ణయించారు. అప్పట్లో నితీశ్ పార్టీ జెడియూ కేంద్రంలోని ఎన్‌డిఎలో భాగస్వామ్య పక్షంగా ఉందని షా గుర్తు చేశారు. 

కేవలం ఎన్నికలలో ఓట్లు రాల్చుకునేందుకు రాష్ట్రంలోని మహాఘట్‌బంధన్ స్వార్థ ప్రయోజనాలతో ముస్లిం, యాదవ్‌ల సంఖ్యను పెంచుతూ నివేదిక వెలువడేలా చేసిందని అమిత్ షా విమర్శించారు. ఇప్పుడు కొత్తగా వెలిసిన ప్రతిపక్ష రాజకీయ కూటమి ఇండియాకు ఎటువంటి ప్రజా సంబంధిత అజెండా లేదని, కేవలం ప్రధాని నరేంద్ర మోదీని తిట్టిపోయడం వీరు ఎంచుకున్న మార్గం అని హోం మంత్రి దాడికి దిగారు. 

దేశానికి తదుపరి ప్రధానిని అవుతాననే పగటికలల నుంచి ఇప్పటికైనా నితీశ్‌కుమార్ బయటకు వస్తే మంచిదని హితవు చెప్పారు. ఆయన కోరికలు ఎప్పటికీ నెరవేరవని తేల్చి చెప్పారు. ఇండియా కూటమికి ఇప్పటికీ కన్వీనర్‌ను ఎంచుకునే సఖ్యత లేదని, ఇక ముందు ముందు కలిసికట్టుగా సాగడం అయ్యేపనేనా? అని ప్రశ్నించారు. 

బీహార్‌లో గూండారాజ్ తిరిగి రావడానికి నితీశ్ బాధ్యులని ఆయన విమర్శించారు. ఆయన ఓ ఫల్టూరామ్ అని, తరచూ పార్టీలు మారుతూ ఉంటారని, ప్రజాతీర్పునకు ద్రోహం చేస్తారని విమర్శించారు. 2022లో ప్రజాతీర్పును మధ్యలోనే దారికి వదిలిపెట్టి మహాఘట్‌బంధన్‌లో చేరారని ,బాటకు మాటకు విలువను ఇవ్వని వ్యక్తి అని అంటూ ముఖ్యమంత్రిపై ఘాటుగా విమర్శలు గుప్పించారు.  వచ్చేలోక్‌సభ ఎన్నికల్లో బీహార్‌లోని 40 స్థానాల్లోనూ బిజెపి విజయం సాధిస్తుందని అమిత్ షా భరోసా వ్యక్తం చేశారు.

బీహార్‌లో కులగణన సర్వే నివేదిక అక్టోబర్ రెండున ప్రజల ముందుకు తీసుకువచ్చారు. ఆ తరువాత రాష్ట్రంలో కేంద్ర హోం మంత్రి బీహార్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. బీహార్ కులగణన నివేదిక ప్రకారం రాష్ట్రంలోని మొత్తం జనాభాలో ఒబిసిలు, ఇబిసిల సంఖ్య 60 శాతానికి పైగా ఉందని నిర్ధారించారు.