కొల్లాపూర్‌ నుండి మలక్‌పేట వరకు బిజెపి బస్సు యాత్ర

కొల్లాపూర్‌ నుండి మలక్‌పేట వరకు బిజెపి బస్సు యాత్ర

రానున్న తెలంగాణ అసెంబ్లీ  ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ప్రజలలోకి వెళ్లేందుకు బీజేపీ ఈ నెల 26 నుండి చేపట్టిన బస్సు యాత్రల షెడ్యూల్‌ను ఖరారు చేసినట్లు తెలిసింది. కృష్ణా జోన్‌ నుంచి సౌత్‌ వెస్ట్‌ మార్గంలో మొదటి యాత్రను చేపట్టాలని యాత్ర రూట్‌ మ్యాప్‌ను ఖరారు చేసింది. కొల్లాపూర్‌లో యాత్ర ప్రారంభమై మలక్‌పేటలో ముగియనుంది. ఈ యాత్ర 19 రోజుల పాటు 1315 కిలోమీటర్ల మేర సాగనుంది. 

ఇదిలా ఉంటే బస్సు యాత్రలను రాష్ట్రంలోని మూడు ప్రాంతాల నుంచి ప్రారంభించాలని బీజేపీ నిర్ణయించింది. ఈ యాత్రలను అక్టోబర్‌ 13 కల్లా ముగించాలని సంకల్పించింది. భద్రాచలం, బాసరా నుంచి మొదలు పెట్టే యాత్రల రూట్‌ మ్యాప్‌ ఖరారు కావాల్సింది.

మొత్తంగా బస్సు యాత్రల ద్వారా కేసీఆర్‌ ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా రాష్ట్ర ప్రజలను ఎలా మోసం చేస్తోంది, ప్రభుత్వంలో చోటు చేసుకున్న అవినీతిని ప్రజలకు వివరించడంతో పాటు కేంద్రంలోని మోదీ  ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను ఇంటింటికి ఈయాత్రల ద్వారా చేరవేయనున్నట్లు బీజేపీ సీనియర్‌ నేత ఎన్‌వి.సుభాష్‌ మీడియాతో చెప్పారు.

మూడు రూట్లలో చేపట్టనున్న బస్సు యాత్రల్లో ఒక రూట్‌కు కిషన్‌ రెడ్డి నేతృత్వం నిర్వహించడంతోపాటు మిగతా రెండు రూట్ల యాత్రలను కూడా ఆయన ఎప్పటికప్పుడు పర్యవేక్షించనున్నారు.  బీజేపీ పట్టున్న మొత్తం 40 నియోజకవర్గాల్లో మొదట యాత్రను ప్రారంభించాలని నిర్ణయించినట్లు తెలిసింది. 

ఉమ్మడి మహబూబ్‌నగర్‌, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లో యాత్ర కొనసాగనుంది. మొదటి రోజు కొల్లాపూర్‌లో ప్రారంభమయ్యే యాత్ర 10 కిలోమీటర్లు సాగనుంది. చివరి రోజు 19వ రోజు చాంద్రాయణగుట్ట, ఎల్బీ నగర్‌, సికింద్రాబాద్‌, మలక్‌పేట్‌కు చేరుకొని ముగియనుంది.  ఒక్కో నియోజకవర్గంలో 10 కిలోమీటర్ల నుంచి 110 కిలోమీటర్ల వరకు సాగనుంది.