ప్రపంచ జీవ ఇంధన కూటమి (గ్లోబల్ బయో ఫ్యూయల్ అలయెన్స్)ను ప్రారంభిస్తున్నట్లు భారత్ శనివారం ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్లో ఇథనాల్ కలపడాన్ని 20 శాతానికి తీసుకు వెళ్లాలనే ప్రతిపాదనతో ఏర్పాటయిన ఈ కూటమిలో చేరాలని జి20 దేశాలను కోరింది.
జి20 సదస్సులో తొలి సెషన్ అయిన ‘ఒన్ ఎర్త్’ సెషన్లో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ పర్యావరణ, వాతావరణ పరిశీలన కోసం జి20 శాటిలైట్ మిషన్ను కూడా ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ‘అన్ని దేశాలు ఇంధనం మిశ్రమం రంగంలో కలిసి సని చేయాల్సిన సమయం ఇది. పెట్రోల్లో ఇథనాల్ను 20 శాతం దాకా కలపడాన్ని అంతర్జాతీయ స్థాయిలో చేపట్టాలనేది మా ప్రతిపాదన. లేదా ప్రపంచానికి మేలు చేసే మరో ప్రత్యామ్నాయం కోసం మనం కృషి చేయవచ్చు’ అని ప్రధాని చెప్పారు.
వాతావరణ మార్పు సవాలును దృష్టిలో పెట్టుకుని 21వ శతాబ్దంలో ఇంధన మార్పిడి అనేది అత్యవసరమని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ మార్పిడికి లక్షల కోట్ల డాలర్లు అవసరమని ఆయన అంటూ అభివృద్ధి చెందిన దేశాలు ఈ విషయంలో కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని సూచించారు.
ఈ ఏడాది ఈ విషయంలో అభివృద్ధి చెందిన దేశాలు సానుకూల చొరవ తీసుకున్నందుకు భారత్తో పాటుగా అభివృద్ధి చెందుతున్న దేశాలన్నీ సంతోషిస్తున్నాయని ఆయన చెప్పారు. ప్రపంచంలో మూడో అతిపెద్ద చమురు వినియోగ దేశాల కూటమి అయిన ప్రపంచ జీవ ఇంధన కూటమిని ఏర్పాటు చేయాలని భారత్ గత కొంత కాలంగా ప్రయత్నిస్తూనే ఉంది.
2015లో పారిస్లో జరిగిన ప్రపంచ వాతావరణ సదస్సులో శుద్ధమైన, చౌక అయిన సౌర విద్యుత్ను అందరికీ అందుబాటులోకి తీసుకు రావాలని ప్రతిపాదించారు. జి20 సదస్సులో ఈ కూటమి ఏర్పాటుకు సంబంధించి ప్రతిపాదన చేయనున్నట్లు ఇటీవల ఓ ప్రత్యేక ఇంటర్వూలో కూడా ప్రధాని మోదీ చెప్పారు.
2025 నాటికి పెట్రోల్లో 20 శాతం ఇథనాల్ మిళితం చేయాలన్న లక్ష్యాన్ని చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్న భారత్ ఈ దిశగా ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా డజన్ల సంఖ్యలో కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లను ఏర్పాటు చేసింది కూడా. రవాణా సహా వివిధ రంగాల్లో నిలకడగా బయో ఇంధనాలను ఉపయోగించే విషయంలో సహకారాన్ని పెంపొందించడంతో పాటుగా ఈ కృషిని మరింత తీవ్రం చేయడం లక్షంగా ఈ గ్లోబల్ బయోఫ్యూయల్ అలయెన్స్ను ఏర్పాటు చేశారు.
ఇప్పటికే 19 దేశాలు, 12 అంతర్జాతీయ సంస్థలు ఈ కూటమిలో చేరాయి. చేరిన దేశాలలో జి20 దేశాలైన అమెరికా, భారత్, దక్షిణ ఆఫ్రికా, కెనడా, బ్రెజిల్, అర్జెంటీనా, ఇటలీ లతో పాటు ప్రత్యేక ఆహ్వానిత దేశాలు బంగ్లాదేశ్, సింగపూర్, మారిషస్, యూఏఈ ఉన్నాయి. ఇక జి20లో లేని దేశాలైన ఐస్లాండ్, కెన్యా, గయానా, పారగుయ్, సెయ్చెల్లెస్, శ్రీలంక, యుగాండా, ఫిన్ ల్యాండ్ ఉన్నాయి.
వ్యవసాయ ఉత్పత్తులు, సేంద్రీయ వ్యర్థాల ద్వారా తయారయ్యే ఇంధనాలను ‘జీవ ఇంధనం’ అంటారు. ఇథనాల్, బయోడీజిల్, బయోగ్యాస్ మొదలైనవి జీవ ఇంధనాలుగా ప్రాచుర్యం పొందాయి. వీటిని వాహనాలు, షిప్పింగ్, విమానయానం కోసం ఉపయోగించనున్నారు. జీవ ఇంధనంతో కర్బన ఉద్గారాల విడుదల చాలా తక్కువగా ఉంటుంది. స్థానికంగా సాగుచేసిన పంటలను జీవ ఇంధనం తయారీకి ఉపయోగిస్తే.. ఉపాధి అవకాశాలతో పాటు ఇంధన భద్రతకు తోడ్పడుతుందని నిపుణులు సూచిస్తున్నారు.
More Stories
48 గంటల్లో సిట్ ముందు లొంగిపో.. ప్రజ్వల్కు హితవు
ఎన్నికల్లో విపక్ష కూటమికి గట్టి ఎదురుదెబ్బ
బాల్యం నుండి స్వయంసేవక్ నే… తిరిగి ఆర్ఎస్ఎస్ కోసం పనిచేస్తా!