ఇండియాను ఇక భారత్ అని అందరూ పిలవాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్ సంఘచాలక్ డా. మోహన్ భగవత్ దేశంలోని ప్రజలను పిలుపిచ్చారు. భారతదేశం అనే పేరుకు చారిత్రక ప్రాధాన్యత ఉందని, ఇది పురాతన కాలం నుంచి వాడుకలో ఉందని ఆయన తెలిపారు. గౌహతిలో సకల్ జైన సమాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మోహన్ భగవత్ మాట్లాడుతూ మన దేశం పేరు పూర్వం నుంచి భారత్ అని గుర్తు చేశారు.
భాషలు ఎలా ఉన్నా పేరు మాత్రం అలాగే ఉంటుందని చెప్పారు. లెక్కలేనన్ని తరాలుగా భారతదేశం అనేది మన దేశానికి పేరని తెలిపారు. భాషా భేదం లేకుండా ప్రజలు భారతదేశం అని పిలవడం ప్రారంభించాలని డా. భగవత్ పిలుపిచ్చారు. అన్ని రంగాలలో భారతదేశం పేరును ఉపయోగించాలని, దీనిపై ప్రజలలో అవగాహన కల్పించాలని ఆయన సూచించారు.
అయితే, కొన్నిసార్లు మనం ఇంగ్లీషులో మాట్లాడేటప్పుడు ఇండియా అని వాడాల్సి వస్తుందని, అవతలి వ్యక్తికి అర్థమయ్యేలా దీన్ని మనం ఈ విధంగా ఉపయోగిస్తామని చెప్పారు. కానీ, ఇకపై అలా చేయాల్సిన అవసరం లేదని డా. భగవత్ స్పష్టం చేశారు. భాష ఆధారంగా ప్రత్యేక పేర్లను మార్చలేరని అంటూ ప్రపంచంలో ఎక్కడా ఇలా జరగలేదని పేర్కొన్నారు.
ప్రపంచ వేదికపై భారతదేశం ఏకం చేసే శక్తిగా వ్యవహరిస్తోందని ఆయన భరోసా వ్యక్తం చేశారు. భారత దేశ విద్యా వ్యవస్థపై బ్రిటిష్ వలస ప్రభావం ఉందని, దానిని తెరమరుగు చెయ్యాలని స్పష్టం చేశారు. “మన దేశం భారత్, మనం ‘ఇండియా’ అనే పదాన్ని ఉపయోగించడం మానేసి, అన్ని ఆచరణాత్మక రంగాలలో భారత్ను ఉపయోగించడం ప్రారంభించాలి. అప్పుడే మార్పు వస్తుంది. మన దేశాన్ని భారత్ అని పిలవాలి. ఇతరులకు కూడా వివరించాలి” అని సూచించారు.
More Stories
అండమాన్ను తాకిన నైరుతి రుతుపవనాలు
ఎంపీగా గెలుపొందితే బాలీవుడ్కు కంగనా వీడ్కోలు
కేజ్రీవాల్ నిరసన పిలుపుతో ఢిల్లీలో ఉద్రిక్తత