వచ్చే ఏడాది జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల కోసం రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీపడే అభ్యర్థుల్లో భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త వివేక్ గణపతి రామస్వామి దూసుకుపోతున్నారు. తాజాగా, ఎమెర్సన్ కాలేజీ వద్ద నిర్వహించిన పోలింగ్లో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 56 శాతం ఓట్లతో మొదటి స్థానంలో నిలవగా ఒక్కొక్కరూ 10 శాతం ఓట్ల చొప్పున రెండో స్థానంలో రామస్వామి, ఫ్లోరిడా గవర్నర్ రాన్ డేశాంటిస్ నిలిచారు.
అయితే, రామస్వామి మద్దతుదారుల్లో సగం మంది ఆయనకే ఓటు వేస్తామని గట్టిగా చెబుతుంటే డేశాంటిస్ మద్దతుదారుల్లో మాత్రం తడబాటు కనిపిస్తోంది. ఆయన మద్దతుదారుల్లో కేవలం 3వ వంతు మంది మాత్రమే ఓటు వేస్తామని దృఢంగా చెబుతున్నారు. జూన్లో నిర్వహించిన పోలింగ్లో 21 % ఓట్లు సాధించిన డేశాంటిస్ తాజా పోలింగ్లో 10 శాతానికి పడిపోవడం గమనార్హం. మరోవైపు, రామస్వామికి తన ఓటింగ్ను పెంచుకోవడం ( 2% ఓట్లు పెరుగుదల) విశేషం.
పోస్టుగ్రాడ్యుయేట్ ఓటర్ల మద్దతు రామస్వామికి పెరుగుతోందని, వారిలో 17 శాతం మంది ఆయనకు మద్దతుగా నిలిచారని ఎమెర్సన్ కాలేజ్ పోలింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ స్పెన్సర్ కింబల్ వెల్లడించారు. ట్రంప్ మొదటి స్థానంలో కొనసాగుతున్నప్పటికీ ఆయనపై ప్రస్తుతం ఉన్న కేసుల దృష్ట్యా రెండో స్థానంలోని రామస్వామికే ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ పై పోటీలో నిలిచే అవకాశం ఆయనకే ఉంటుందని భావిస్తున్నారు.
సౌత్ కరోలినా మాజీ గవర్నర్ నిక్కీ హేలీ, హర్ష్ వర్ధన్ సింగ్లతో సహా వివేక్ రామస్వామి వచ్చే వారం మొదటి రిపబ్లికన్ ప్రైమరీ డిబేట్లో పాల్గనడానికి స్పష్టమైన అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ డిబేట్కు హాజరుకాకూడదని ట్రంప్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 80% కంటే ఎక్కువ మంది రిపబ్లికన్ ప్రైమరీ ఓటర్లు తాము చర్చను చూడాలనుకుంటున్నామని చెప్పారు.
తన రాజకీయ ప్రచారం ‘న్యూ అమెరికన్ డ్రీమ్’పై రామస్వామి దృష్టి సారించారు. ఇదే సమయంలో టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ సైతం రామస్వామికి మద్దతు ప్రకటించారు. ఆయనను చాలా సమర్ధవంతమైన అభ్యర్థిగా అభివర్ణించారు. తాను కేవలం అధ్యక్ష అభ్యర్ధిగానే పోటీపడతానని, వైస్-ప్రెసిడెంట్ అభ్యర్ధిత్వంపై తనకు ఆసక్తి లేదని వివేక్ రామస్వామి చెప్పినట్టు ది హిల్ నివేదించింది.
ప్రెసిడెన్షియల్ అభ్యర్ధిగా విఫలమైతే తాను ఉపాధ్యక్ష పదవికి పోటీ పడనని తెలిపారు. ‘డొనాల్డ్ ట్రంప్, నేను ఉమ్మడిగా ఏదో పంచుకుంటాం.. మా ఇద్దరం నంబర్ 2 స్థానంలో రాణించలేం’ అని స్పష్టం చేశారు. 38 ఏళ్ల వయసున్న రామస్వామి భారతదేశంలోని కేరళ నుంచి వలస వచ్చిన దంపతులకు ఒహియోలో జన్మించారు. హార్వర్డ్ యూనివర్సిటీలో బయోలాజికల్ డిగ్రీ, యేల్ యూనివర్సిటీలో లా పూర్తిచేశారు. తొలుత బయోటెక్ సంస్థను స్థాపించిన రామస్వామి గతేడాది ఒక ఆస్తి నిర్వహణ సంస్థను ప్రారంభించారు.
‘వోక్ ఇంక్’ సహా అనేక పుస్తకాలను ఆయన రచించారు. ఆ పుస్తకాల ద్వారానే ఆయన అనేకమందికి పరిచయమవుతున్నారు. పాలనా అంశాలతోపాటు కంపెనీల విధానాలు, వాతావరణ, సామాజిక అంశాలనూ ప్రస్తావిస్తుండటం ఆయన ప్రచారంలో సానుకూలంగా మారింది. ఒహాయో స్టేట్ యూనివర్సిటీ వెక్స్నర్ మెడికల్ సెంటర్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న అపూర్వను రామస్వామి వివాహం చేసుకున్నారు.
టెస్లా, ట్విటర్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్ కూడా రామస్వామికి మద్దతు ప్రకటించారు. ‘రామస్వామి చాలా ఆశాజనక అభ్యర్థి’ అని మస్క్ ట్వీట్ చేశారు. రామస్వామి యుద్ధాలకు, వలసలకు వ్యతిరేకి. ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలుకుతానని కూడా రామస్వామి చెప్పారు. పశ్చిమాసియాలో ఇజ్రాయిల్ దేశానికి మిలటరీ సాయాన్ని 2028 తర్వాత అమెరికా నిలిపివేయాలని రామస్వామి తేల్చిచెప్పారు.
ఇజ్రాయిల్కు 38 బిలియన్ డాలర్ల ప్యాకేజీ అమెరికా సాయం ఆ ఏడాదితో ముగియనుంది. అమెరికాలో మత స్వేచ్ఛను తాను కాపాడతానని భరోసా ఇచ్చారు. భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గొప్ప ప్రధాని అని, అత్యుత్తమ నాయకుడని ఒక ఇంటర్వ్యూలో రామస్వామి కొనియాడారు. అమెరికా ఆర్థిక వ్యవస్థకు భారంగా మారిన ఎఫ్బీఐ, ఐఆర్ఎస్, అణు నియంత్రణ కమిషన్ తదితర అనేక ఫెడరల్ సంస్థలను మూసివేస్తానని కూడా ఆయన ప్రతినబూనారు.
More Stories
ఉద్యోగం కోల్పోయిన హెచ్-1బీ వీసాదారులకు ఊరట
‘అధిక సంతానం’ ముస్లింల గురించి కాదు.. పేదల గురించి
2029 వరకు ప్రధానిగా నరేంద్ర మోదీ