చివరి అంకంకు చేరుకున్న చంద్రయాన్ 3

చివరి అంకంకు చేరుకున్న చంద్రయాన్ 3

చంద్రయాన్ 3 అనుబంధ ల్యాండర్ విక్రమ్ చంద్రుడికి సమీపంలోకి అత్యంత సజావుగా సాగుతోంది. దీని సాంకేతిక పనితీరు బాగుందని బెంగళూరులోని ఇస్రో వర్గాలు శుక్రవారం తెలిపాయి. ఇప్పటివరకు జరిగిన అన్ని దశలను విజయవంతంగా పూర్తి చేసుకున్న చంద్రయాన్ 3.. చివరి అంకానికి చేరుకుంది. ప్రస్తుతం చంద్రుడికి అతి చేరువలో ఉన్న చంద్రయాన్ 3 నుంచి ల్యాండ్ అవ్వకముందు నుంచే తన పని మొదలుపెట్టింది.

ల్యాండర్ విక్రమ్‌కు అత్యంత కీలకమైన డిబూస్టింగ్ ప్రక్రియను చేపట్టారు. దీనితో ఇది క్రమేపీ వేగం తగ్గుతూ సాగుతుంది. ఇప్పుడు జరిగిన డిబూస్టింగ్‌తో ల్యాండర్ తన కక్షను 113 కిమీ /157 కిమీ స్థాయిలో తగ్గించుకుంది.  ఈ క్రమంలోనే ఈ విక్రమ్ ల్యాండర్ నుంచి భూ కేంద్రానికి చంద్రుడిని అత్యంత సమీపంలో నుంచి తీసిన ఫోటోలను విజయవంతంగా పంపించింది. ల్యాండర్ సజావుగా తిరగడమే కాకుండా అత్యంత కీలకమైన స్థాయిలో తన నిర్ధేశిత పనిని కూడా చేపట్టిందని ఇస్రో వర్గాలు తెలిపాయి.

ప్రధానమైన ల్యాండర్‌కు చెందిన ల్యాండర్ విక్రమ్, రోవర్ ప్రగ్యాన్‌కు ఈ నెల 20వ తేదీన మరో డిబూస్టింగ్ ప్రక్రియ చేపడుతారు. దీనితో చంద్రయాన్ 3 చంద్రుడికి మరింత చేరువ ఘట్టానికి చేరుకుంటుంది. జాబిల్లి దక్షణ ధృవంపై ఈ నెల 23వ తేదీన సజావుగా దిగేందుకు సానుకూలత ఉంది.

‘ల్యాండర్‌ మాడ్యూల్‌ (ఎల్‌ఎం) ఆరోగ్యం సాధారణంగానే ఉంది. ఈ మాడ్యూల్‌కు డీబూస్టింగ్‌ ఆపరేషన్‌ విజయవంతంగా ముగిసింది. ఈ ప్రక్రియ దాని కక్షను 113 కి.మీ.- 157 కి.మీ.కు తగ్గించింది. విక్రమ్‌ ల్యాండర్‌, ప్రగ్యాన్‌ రోవర్‌తో కూడిన ల్యాండర్‌ మాడ్యూల్‌కు భారత కాలమానం ప్రకారం ఈ నెల 20 వేకువజామున 2 గంటల సమయంలో రెండోసారి డీ బూస్టింగ్‌ ఆపరేషన్‌ జరగనుంది’’ అని ఎక్స్‌ (ట్విటర్‌) వేదికగా ఇస్రో వెల్లడించింది. 

అంతా సవ్యంగా జరిగితే ఈ నెల 23న సాయంత్రం 5:47గంటలకు చంద్రుడి దక్షిణ ధ్రువంపై ల్యాండర్‌ను సాఫ్ట్‌ ల్యాండింగ్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. కాగా చంద్రుడిని అతి దగ్గరి నుంచి తమకు అందిన ఫోటోలను ఇస్రో విడుదల చేసింది. ఇందులో చంద్రుడిపై ఉండే బిలాల ఫోటోలు ఉన్నాయి. భూమి నుంచి చంద్రుడి వైపు చూస్తే లోయలుగా కన్పించే వాటిని ఇప్పుడు వెలువడ్డ ఫోటోల ద్వారా ఫాబ్రీ, గియోర్డానో బ్రునో, హర్కెబి జెగా పేర్కొన్నారు.