సోషల్ మీడియా దుర్వినియోగంపై `సుప్రీం’ హెచ్చరిక

చేతిలో సెల్, దానిలో సోషల్ మీడియా ఉంది కదా అని వినియోగదార్లు దాన్ని దుర్వినియోగ పరచ రాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వాడకంపై అత్యంత జాగ్రత్తగా ఉండాలని, పడే ప్రభావం, చేరిక గురించి ఆలోచించాల్సి ఉందని హితవు చెప్పింది.  నటుడు , తమిళనాడు మాజీ ఎమ్మెల్యే ఎస్ వి శేఖర్ సోషల్ మీడియా వ్యాఖ్యల సంబంధిత పిటిషన్‌ను తోసిపుచ్చిన దశలో న్యాయమూర్తులు బిఆర్ గవాయ్, పి కె మిశ్రాతో కూడిన ధర్మాసనం పిటిషన్‌ను విచారించింది.

 2018 ఎప్రిల్ 19న శేఖర్ తమ ఫేస్‌బుక్ ఖాతాలో మహిళా జర్నలిస్టు పట్ల దూషణలు, అమర్యాదకర, వెకిలి వ్యాఖ్యలకు ఫలితంగా తర్వాత కేసు దాఖలు అయింది. తనపై దాఖలైన క్రిమినల్ కేసులను ఎత్తివేయాలని దాఖలు చేసుకున్న పిటిషన్  ను మద్రాసు హైకోర్టు జులై 14న కొట్టివేసింది. దీనిని సవాలు చేస్తూ శేఖర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

అయితే సోషల్ మీడియా దుర్వినియోగం ఆక్షేపణీయం అని ధర్మాసనం స్పందించింది. మనం చేసే వ్యాఖ్యలు ఏ విధంగా ప్రభావితం చేస్తాయి? అవి ఎంతవరకు వెళ్లుతాయనేది ఆలోచించుకుని, బాధ్యతాయుతంగా ఉండాలని ధర్మాసనం తెలిపింది. 

అయితే తమ క్లయింట్ సోషల్ మీడియా పోస్టింగ్ దశలో కళ్లల్లో ఏదో మందు వేసుకున్నారని, తాను పంపించిన రాతలలో ఏముందనేది చదవలేకపోయ్యారని లాయర్ విన్నవించుకున్నారు. ఈ వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది. సోషల్ మీడియా అత్యవసరం అని భావించుకుంటే, దీని వల్ల తలెత్తే విపరీత పరిణామాలను అనుభవించాల్సి ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది.

శేఖర్ పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు ఈ దశలో సోషల్ మీడియా వాడకంపై ఆసక్తికర స్పందనకు దిగింది. ‘ఇప్పుడు మనం పూర్తిగా సోషల్ మీడియా యుగంలో జీవిస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా మనిషి జీవితంలోకి ఈ మాధ్యమం నిట్టనిలువునా చీల్చుకుంటూ పోయింది. పైగా ఇది అత్యంత వేగవంతమైన సాధనం అయింది’ అని గుర్తు చేసింది. 

దీని ద్వారా మనం పంపించే ఎటువంటి సందేశం పంపించినా, ఇతరులు పంపించిన వాటిని మనం తిప్పి పంపించినా నలుమూలలకు క్షణాలలో చేరుకుంటుందని తెలిపింది. `సోషల్ మీడియా ద్వారా పంపించిన సందేశం ధనస్సు నుంచి వదిలిపెట్టిన బాణం. ఇది బాణంతో నిమిత్తం లేకుండా దూసుకుపోతూనే ఉంటుంది’ అంటూ న్యాయస్థానం హెచ్చరించింది.