సెప్టెంబర్ నాటికి అయోధ్య ఎయిర్‌పోర్ట్ నిర్మాణం

సెప్టెంబర్ నాటికి అయోధ్య ఎయిర్‌పోర్ట్ నిర్మాణం

అయోధ్యలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ”మర్యాద పురుషోత్తమ్ శ్రీ రామ్ ఎయిర్‌పోర్ట్” నిర్మాణం వచ్చే సెప్టెంబర్‌ నాటికి పూర్తికానుందని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. సుమారు రూ.350 కోట్ల వ్యయంతో అభివృద్ధి పరుస్తున్న ఈ విమానాశ్రయం ఎ 320/బి-737 తరహా విమానాల రాకపోకలకు అనువుగా ఉంటుందని చెప్పింది.

అభివృద్ధి పనుల్లో భాగంగా ప్రస్తుతం ఉన్న రన్‌వేను 1500 మీ x 30మీ  నుంచి 2200మీ x 45మీ  వరకూ విస్తరించడంతో పాటు ఇంటెరిమ్ టెర్మనల్ బిల్డింగ్, ఏటీసీ టవర్, ఫైర్ స్టేషన్, కార్ పార్కింగ్, వంటి సౌకర్యాలు కల్పిస్తున్నట్టు తెలిపింది.

”కొత్త ఇంటెరిమ్ టెర్నినల్ బిల్డింగ్ 6250 చదరపు కిలోమీటర్ల ఏరియాలో విస్తరించి ఉంటుంది. రద్దీ సమయంలో 300 మంది ప్రయాణికులకు ఇందులో ఉండే అవకాశం ఉంటుంది. ప్రయాణికుల సౌకర్యార్థం 8 చెక్-ఇన్-కౌంటర్లు, 3 కన్వేయర్ బెల్ట్‌లు (డిపార్చర్ హాలులో 1, అరైవల్ హాల్‌లో రెండు), 75 కార్లు నిలిపి ఉంచే కార్ పార్కింగ్, ద్విచక్ర వాహనాల పార్కింగ్ ఉంటుంది” అని పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ తెలిపింది.

 టెర్నినల్ బిల్డింగ్‌లోని విశేషాల గురించి తెలియజేస్తూ, డబుల్ ఇన్స్యులేటెడ్ రూఫింగ్ సిస్టమ్, ఎల్ఈడీ లైటింగ్, లో హీట్ గైన్ డబుల్ గ్లేజింగ్ యూనిట్, పౌంటేన్లు, హెచ్‌వీఏసీ, వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్, మురుగుశుద్ధి ప్లాంట్, 250 కేడబ్ల్యూపీ సామర్థ్యం ఉన్న సోలార్ పవర్ ప్లాంట్ వంటి ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపింది.
అయోధ్య సంస్కృతీ వారసత్వాన్ని ప్రతిబింబించేలా టెర్నినల్ సర్వాంగసుందరంగా సిద్ధమవుతున్నట్టు వివరించింది. టెర్మినల్ బిల్డింగ్ బయట, వెలుపల కూడా అయోధ్య నూతన ఆలయ నిర్మాణాన్ని ప్రతిబింబించే కళాకృతులు ఉంటాయని, భగవాన్ శ్రీరాముని జీవిత విశేషాలతో కూడిన స్థానిక కళాకృతులు, పెయింటింగ్‌లు, మురల్స్ డిజైన్లతో ఇంటీరియర్ ఉంటుందని, ప్రయాణికులకు ఆధ్యాత్మిక లోకంలో అడుగుపెట్టిన అనుభూతి కలుగుతుందని వివరించింది.