వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో హిందూ దేవాలయాల రక్షణ, పవిత్రత ప్రశ్నార్ధకంగా మారుతున్న సమయంలో ప్రపంచంలోని ప్రముఖమైన హిందూ దేవాలయమైన తిరుమలలోని శ్రీవారి ఆలయంలో గర్భగుడి దగ్గరనే ఎవ్వరో భక్తుడు వీడియో చిత్రీకరణ చేయడం, దానిని సోషల్ మీడియాలో వైరల్ కావించడం పెను దుమారం రేపుతోంది. తిరుమలలో భద్రతాపరమైన చర్యలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులను మూడంచెల తనిఖీలు చేస్తుండగా, చేతి బ్యాగ్ లను సహితం అనుమతించని భద్రతా వలయంలోకి, నిషేధించిన మొబైల్ ఫోన్ తో ఏవిధంగా వెళ్లారని పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మూడంచెల భద్రతను దాటి మరీ ఓ భక్తుడు మొబైల్ ఫోన్తో శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించాడు.
అంతటితో ఆగకుండా ఆలయంలో నలువైపుల నుంచి ఆనంద నిలయాన్ని ఫోన్తో చిత్రీకరించాడు. ప్రస్తుతం ఆనంద నిలయం విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వర్షం పడుతున్న సమయంలో ఆనంద నిలయాన్ని అతి సమీపం నుంచి భక్తుడు ఈ వీడియో తీసినట్లు తెలుస్తోంది.
ఆగమాశాస్త్రం ప్రకారం తిరుమల ఆనంద నిలయంపై నుంచి విమానాలు వెళ్లరాదు. దాన్ని ఫొటోలు తీయడం కూడా తప్పు. అలాంటిది ఏకంగా ఒక భక్తుడు వీడియో తీయడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల తిరుమల కొండకు టెర్రరిస్టుల ముప్పు ఉందని హెచ్చరికలు వచ్చాయి. దాంతో పాటు తిరుమల కొండపై విమానాలు చక్కర్లు కొట్టాయి. ఇలా నిత్యం ఏదో ఒక చోట అపచారం జరుగుతుండడంతో భక్తులు మండిపడుతున్నారు.
అయితే భక్తుడు శ్రీవారి ఆలయంలో ఇంకేమైనా చిత్రికరించాడా అన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. మరోవైపు ఈ ఘటనపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) విచారణ చేపట్టింది. ఆలయం లోపలి సీసీ కెమెరా విజువల్స్ను టీటీడీ అధికారులు పరిశీలిస్తున్నారు. కాగా, తిరుమల శ్రీవారి ఆలయంలో కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. ఎక్కడికక్కడ సీసీ కెమెరాలతో నిరంతరం భద్రతను పర్యవేక్షిస్తూనే ఉంటారు. ఆలయానికి వచ్చే భక్తులను క్షుణ్నంగా పరిశీలించిన తర్వాతే లోపలికి అనుమతిస్తుంటారు. సెల్ఫోన్, కెమెరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరు.
ఇంత పకడ్బందీగా భద్రత ఉన్నప్పటికీ ఓ భక్తుడు ఈ విధంగా శ్రీవారి ఆలయంలోకి సెల్ఫోన్ను తీసుకెళ్లడమే కాకుండా, ఆనంద నిలయాన్ని వీడియోలు తీయడంపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం భక్తులతో కిటకిటలాడే శ్రీవారి ఆలయంలో మొబైల్ ఫోన్తో తిరిగినా సీసీ కెమెరాల సిబ్బంది గుర్తించని పరిస్థితి నెలకొనడం భద్రతా వైఫల్యాన్ని స్పష్టం చేస్తుంది.
ఆదివారం రాత్రి తిరుమలలో ఉరుములతో కూడిన వర్షం కురవడంతో దాదాపు 2 గంటల పాటు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిందని, అదే సమయంలో సదరు భక్తుడు లోపలికి తీసుకెళ్లిన పెన్ కెమెరాతో వీడియో చిత్రీకరించినట్లు అనుమానిస్తున్నామని టీటీడీ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ (సీవీఎస్ఓ) నరసింహ కిశోర్ పేర్కొన్నారు.
శ్రీవారి ఆలయంలో పాటించాల్సిన నిబంధనల గురించి భక్తులందరికీ తెలుసని, అయినప్పటికీ ఇలా చేయడం బాధాకరమని పేర్కొన్నారు.
సీసీటీవీల ద్వారా భక్తుడిని గుర్తించి తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. టీటీడీ ఈవో ధర్మారెడ్డి ఆదేశాల మేరకు ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తామని తెలిపారు.
ఈ క్రమంలో తిరుమల ఆనంద నిలయం దృశ్యాలను చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేసిన వ్యక్తిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని నరసింహ కిశోర్ వెల్లడించారు. టీటీడీ నిబంధనల ప్రకారం శ్రీవారి ఆలయంలోకి ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకెళ్లడం, వీడియో చిత్రీకరించడం చట్టపరంగా నేరం అనే విషయం భక్తులందరికీ తెలుసని తెలిపారు.
More Stories
తెలంగాణలో ‘గాడిద గుడ్డు’ పాలన
వేముల రోహిత్ దళిత్ కాదు…. కేసు మూసివేత
ధర్మవరంలో బిజెపి కార్యకర్తలలపై రెచ్చిపోయిన వైసీపీ మూకలు