బీహార్‌లో గ్యాంగ్ స్టర్ విడుదలపై `సుప్రీం’ జోక్యం కోరిన స్మిత

బీహార్‌లో గ్యాంగ్ స్టర్ విడుదలపై `సుప్రీం’ జోక్యం కోరిన స్మిత
బీహార్‌లో ఐఏఎస్ అధికారి జి. కృష్ణయ్య హత్యకేసులో దోషి, మాజీ ఎంపీ అయిన గ్యాంగ్ స్టర్ ఆనంద్‌మోహన్‌ సింగ్‌ను జైలు నుండి విడుదల చేసేందుకు బీహార్‌ ప్రభుత్వం సౌలభ్యం కల్పించడం పట్ల తెలంగాణ సీఎం కార్యాలయ కార్యదర్శి, సీనియర్ ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు.
 
దోషుల విడుదలపై జోక్యం చేసుకోవాలని ఆమె సుప్రీంకోర్టు, భారత ప్రధాన న్యాయమూర్తిని అభ్యర్థించారు. కృష్ణయ్య కుటుంబానికి స్మిత బుధవారం సంఘీభావం తెలిపారు. విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వోద్యోగిని హత్య చేసినట్లు అభియోగాలు మోపబడిన దోషి విడుదల చేయాలని నిర్ణయించడంపై ఆమె విస్మయం వ్యకం చేశారు. ‘సివిల్‌ సర్వెంట్‌గా ఉంటే ఇచ్చే విలువ ఇంతేనా? అని ఆశ్చర్యం కలుగుతుంది’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
 
గోపాల్‌గంజ్ మాజీ జిల్లా మేజిస్ట్రేట్ జి. కృష్ణయ్యను దారుణంగా హత్య చేసిన కేసులో దోషులను విడుదల చేయాలనే బీహార్ ప్రభుత్వ నిర్ణయం పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన సెంట్రల్ ఐఎఎస్ అసోసియేషన్ ప్రకటనను ఆమె రీట్వీట్ చేశారు.
 
విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వోద్యోగిని హత్య చేసిన దోషి విడుదల చేస్తే న్యాయాన్ని తిరస్కరించినట్లేనని ఐఎఎస్ అసోసియేషన్ పేర్కొంది. ఈ నిర్ణయం ప్రభుత్వోద్యోగుల మనోధైర్యాన్ని క్షీణింపజేస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. బీహార్ ప్రభుత్వం తన నిర్ణయాన్ని వీలైనంత త్వరగా పునఃపరిశీలించాలని అసోసియేషన్ అభ్యర్థించింది.
 
హైదరాబాద్‌లో నివసిస్తున్న కృష్ణయ్య కుటుంబం, బ్యూరోక్రాట్‌పై దాడికి ప్రేరేపించిన మాజీ ఎంపీ ఆనంద్ మోహన్ సింగ్‌ను విడుదల చేయడంలో జోక్యం చేసుకొని ఆపాలని ప్రధాని నరేంద్ర మోదీని అభ్యర్థించారు. బీహార్ జైలు మాన్యువల్‌ను సవరించడం ద్వారా మాజీ ఎంపీ ఆనంద్ మోహన్ సింగ్‌ను విడుదల చేయాలని బీహార్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని హత్యకు గురైన దళిత ఐఏఎస్ అధికారి కృష్ణయ్య భార్య ఉమ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జోక్యం చేసుకుని నితీష్ కుమార్ తన నిర్ణయాన్ని ఉపసంహరించుకునే చేయాలని విజ్ఞప్తి చేశారు.