ఆస్ట్రేలియాలో మరో హిందూ దేవాలయంపై దాడి

ఆస్ట్రేలియాలో మరో హిందూ దేవాలయంపై దాడి

ఆస్ట్రేలియాలో గత కొద్ది రోజులుగా హిందూ దేవాలయాలపై దాడులు కొనసాగుతున్నాయి. శనివారం మరో దేవాలయంపై ఖలిస్థాన్ మద్దతుదారులు దాడి చేశారు. దక్షిణ బ్రిస్బేన్‌లోని బర్‌బాంక్ సబర్బ్ లోగల శ్రీ లక్ష్మి నారాయణ దేవాలయం స్థానికంగా హిందువులు తరచుగా వెళ్లే గుడి. ఆ ఆలయంపై ఖలిస్తాన్ అనుకూలవాదులు శనివారం దాడి చేసి ధ్వంసం చేశారు.

వారి దాడిలో గుడి పాక్షికంగా ధ్వంసమైంది. ముఖ్యంగా ప్రహారీ గోడను ఖలిస్తాన్ అనుకూలవాదులు పూర్తిగా ధ్వంసం చేశారు. గుడి పూజారి, ఇతర భక్తులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.  క్వీన్స్‌ల్యాండ్ పోలీస్ ఆఫీసర్లకు ఫిర్యాదు చేయగా, ఆలయానికి, భక్తులకు భద్రత చేకూరుస్తామని వారు హామీ ఇచ్చారని ఆలయ ప్రెసిడెంట్ సతీందర్ శుక్లా చెప్పారు.

ఈ తాజా నేర సంఘటన ఆస్ట్రేలియా లోని హిందువులను భయపెట్టడానికేనని హిందూ మానవ హక్కుల డైరెక్టర్ సరా గేట్స్ పేర్కొన్నారు. దేవాలయాలను ధ్వంసం చేయడం, దేవాలయాల గోడలపై అసభ్య, అభ్యంతరకర వ్యాఖ్యలు, నినాదాలు రాయడం, సైబర్ వేధింపులు మొదలైన చర్యలతో భయాందోళనలను సృష్టించాలని చూస్తున్నారని ఆమె విమర్శించారు.

దాడి జరిగిన తరువాత ఆలయం వద్ద హిందువుల ఆందోళన చేసే దృశ్యాన్ని ఆలయ కమిటీ సభ్యులు కొందరితో కలిసి ఆలయాన్ని శుభ్రం చేస్తున్న దృశ్యాలను ఆమె ట్వీట్ చేశారు.గత రెండు నెలల్లో ఆస్ట్రేలియా లోని హిందూ దేవాలయాలపై దాడి జరగడం ఇది నాలుగోది.

మెల్‌బోర్న్ ఇస్కాన్ ఆలయం గోడలను జనవరి 23న ధ్వంసం చేయగా, జనవరి 16న విక్టోరియా కేర్రమ్ డౌన్స్‌లో చారిత్రక శ్రీ శివవిష్ణు ఆలయ గోడలను ధ్వంసం చేశారు. జనవరి 12న మెల్‌బోర్న్ లోని స్వామినారాయణ్ ఆలయంపై దాడి జరిగింది. భారత ప్రభుత్వం ఈ విధ్వంస సంఘటనలను ఆస్ట్రేలియా ప్రభుత్వం దృష్టికి పలుమార్లు తీసుకెళ్లింది.

గత నెల భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ ఆస్ట్రేలియాలో పర్యటించినప్పుడు కూడా ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్‌ను కలుసుకున్నప్పుడు ఈ సంఘటనలపై ప్రస్తావించారు. ఖలిస్థాన్ మద్దతుదారుల చర్యలపై నిఘా ఉంచాలని కోరారు.