చైనా అత్యంత బలమైన, క్రమశిక్షణ కలిగిన శత్రువు

అమెరికా ఇప్పటివరకు ఎదుర్కొన్న దేశాలతో పోలిస్తే చైనా అత్యంత బలమైన, క్రమశిక్షణ కలిగిన శత్రువని అధ్యక్ష రేసులో ఉన్న నిక్కీ హేలీ హెచ్చరించారు. శుక్రవారం  వాషింగ్టన్ లోని  రిపబ్లికన్ పార్టీ కార్యక్రమంలో మాట్లాడుతూ మనం చైనాను జవాబుదారీ చేయాలని స్పష్టం చేశారు. అది కరోనా నుంచే ప్రారంభం కావాలని చెప్పారు.

అలాగే మన సరిహద్దులకు ఫెన్టానిల్ (తీవ్రమైన నొప్పి నివారణకు వాడే డ్రగ్)ను పంపుతోన్న ఆ దేశాన్ని ఎదుర్కోవాలని హేలీ తెలిపారు. అలాగే ఇటీవల చైనా నిఘా బెలూన్ ఘటనపైనా ఆమె స్పందించారు.‘అమెరికా గగనతలంలోకి ఓ చైనా నిఘా బెలూన్ వస్తుందని నేను ఎన్నడూ అనుకోలేదు. ఇది మనకెంతో అవమానం’ అని అంటూ బైడెన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

‘బైడెన్ ప్రభుత్వం చైనా విషయంలో వ్యవహరిస్తున్న తీరును నేను నమ్మలేకపోతున్నా. మన దేశంలో చైనా సంస్థలు 3,80,000 ఎకరాల భూమిని సొంతం చేసుకున్నాయి. వీటిలో కొన్ని మన మిలిటరీ బేస్‌లకు దగ్గరగా ఉన్నాయి’ అంటూ ఆమె విస్మయం వ్యక్తం చేశారు.  ఒక శత్రుదేశం మన దగ్గర భూమిని కొనుగోలు చేసేందుకు ఎట్టిపరిస్థితుల్లోను అనుమతించకూడదని హేలీ స్పష్టం చేశారు. అమెరికా పని అయిపోయిందని చైనా భావిస్తోందని, ఈ విషయంలో అది పొరబడుతోందని ఆమె హెచ్చరించారు.

తన దేశాన్ని మళ్లీ తీర్చిదిద్దేందుకే తాను అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు హేలీ చెప్పారు. యువతరం కోసం ఓటు వేయాలని ఆమె తోటి రిపబ్లికన్లకు విజ్ఞప్తి చేశారు. ఒక పార్టీగానే కాకుండా ఒక దేశంగా విజయం సాధించాలనుకుంటే తనకు అండగా నిలబడాలని ఆమె కోరారు.