ఇరాన్ లో దారుణం చోటు చేసుకున్నది. బాలికలు పాఠశాలలకు వెళ్లకుండా ఉండేందుకు వందలాది మంది విద్యార్థినులపై విష ప్రయోగం జరిగింది. క్వామ్ సిటీలో ఈ దారుణం చోటు చేసుకుందని డిప్యూటీ మంత్రి యోన్స్ పనాహి ధ్రువీకరించారు. పవిత్ర నగరం క్వామ్ సిటీతో పాటు చాలా చోట్ల బాలికల పాఠశాలలను మూసివేయాలని కొందరు వ్యక్తులు వందలాది మంది బాలికలకు విషం కలిపారని మంత్రి పేర్కొన్నారు.
గతేడాది నవంబర్ నుంచి అనేక మంది బాలికలు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండడంతో ఆసుపత్రి పాలయ్యారని చెప్పారు. టెహ్రాన్కు దక్షిణాన ఉన్న సిటీలో విద్యార్థినులపై విష ప్రయోగం జరిగినట్లుగా నిర్ధారించారు. అయితే, ఈ కేసులో ఎవరినీ అరెస్టు చేయలేదని, ప్రభుత్వం విచారిస్తున్నట్లు మంత్రి తెలిపారు.
ఇరాన్లోని నాలుగు నగరాల్లోని 14 పాఠశాలల్లో చదవుతున్న బాలికలే లక్ష్యంగా చేసుకున్నారని చెప్పారు. నాలుగు నగరాల్లో వాయువ్య నగరం అర్డెబిల్, రాజధాని టెహ్రాన్, పశ్చిమ నగరం బోరోజార్డ్తో పాటు క్వామ్ సిటీలో జరిగిందని తెలిపారు. ఈ నెల 14న పెద్ద సంఖ్యలో విద్యార్థినుల తలిదండ్రులు నగరంలోని విద్యాశాఖ కార్యాలయం వద్ద చేరుకొని అధికారుల నుంచి సంజాయిషీని కోరినట్టు స్థానిక మీడియా పేర్కొంది.విష ప్రయోగానికి కారణాలపై ఇంటెలిజెన్స్, విద్యాశాఖ వర్గాలు ఆరా తీస్తున్నాయని ప్రభుత్వ ప్రతినిధి అలీ బహదూరీ తెలిపారు. ఇటీవలే ఈ సంఘటనపై న్యాయ విచారణకు ఆదేశించామని ప్రాసిక్యూటర్ జనరల్ పేర్కొన్నారు. ఇరాన్లో హింసాత్మక హిజాబ్ వ్యతిరేక నిరసనలు ఇటీవల దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే.
అయితే, మహిళలకు డ్రెస్ కోడ్పై ప్రభుత్వం విధించిన ఆంక్షలను సవాల్ చేస్తూ 22 ఏళ్ల కుర్ద్ మహసా అమీనీ ఆందోళన చేపట్టగా ఆమె చివరకు డిసెంబర్ 16న పోలీస్ కస్టడీలో మరణించింది. ఆ తర్వాత నిరసనలు నిరసనలు చెలరేగాయి. ఈ నిరసనల్లో భద్రతా బలగాల చేతిలో 500 మందికి పైగా మరణించారు. నలుగురు నిరసనకారులను ఉరితీశారు. వేలాది మందిని జైల్లో నిర్బంధించారు.
More Stories
కాలిఫోర్నియాలో జడ్జిగా తెలుగు మహిళ బాడిగ జయ
శ్రీలంకలో సీతమ్మ వారి పునః ప్రతిష్ట
చైనా సైనిక చర్య ఆపేయాలన్న తైవాన్