ఫిబ్రవరి 13న తెలంగాణ పర్యటనకు ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరి 13 న తెలంగాణకు పర్యటనకు రానున్నారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. పూర్తయిన పలు ప్రాజెక్టులను జాతికి అంకితం చేస్తారు. తెలంగాణకు వస్తున్న ప్రధానికి పెద్ద ఎత్తున స్వాగతం పలికేందుకు బీజేపీ నేతలు ఏర్పాట్లు చేయనున్నారు.
 
ప్రధాని రాక సందర్భంగా సికింద్రాబాద్‌లోని పరేడ్‌గ్రౌండ్‌లో భారీ బహిరంగసభను నిర్వహించాలని నిర్ణయించారు. ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనకు సంబంధించిన సమాచారాన్ని పీఎంవో సికింద్రాబాద్‌ రైల్వే అధికారులతోపాటు బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి శనివారం పంపించింది. తెలంగాణ పర్యటనలో భాగంగా ఫిబ్రవరి 13న ప్రధాని సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేస్తారు. రూ.3069 కోట్లతో పలు పనులకు భూమి పూజ చేయనున్నారు.
 
కాజీపేటలో రూ.521 కోట్లతో రైలు పీరియాడిక్‌ ఓవరాలింగ్‌ వర్క్‌ షాప్‌ నిర్మాణానికి, మహబూబ్‌నగర్‌-చించోళి రహదారి విస్తరణకు, నిజాంపేట, నారాయణకేడ్‌, బీదర్‌ సెక్షన్‌లో మరో జాతీయ రహదారికి రూ.513 కోట్లతో శంకుస్తాపన చేయనున్నారు. ఇక రూ.4వేల కోట్లతో నిర్మించిన పలు ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నారు. సికింద్రాబాద్‌-మహబూబ్‌నగర్‌ డబ్లింగ్‌ లైన్‌ను, ఐఐటీ హైదరాబాద్‌లోని పలు భవనాలను ప్రధాని ప్రారంభించనున్నారు. వాస్తవానికి ఈ నెల 19 తారీఖునే తెలంగాణకు ప్రధాని మోదీ రావాల్సి ఉంది. అయితే అనివార్య కారణాల కారణంగా వాయిదా పడింది.