సమర్థవంతమైన విధానంగా ఆర్‌వీఎం

సమర్థవంతమైన విధానంగా ఆర్‌వీఎం
తాము ప్రతిపాదిస్తున్న ఎలక్ట్రానిక్‌ రిమోట్ ఓటింగ్ మెషిన్ (ఆర్‌వీఎం)ను  పటిష్టమైన, ఫెయిల్‌ప్రూఫ్, సమర్థవంతమైన స్టాండ్-అలోన్ విధానంగా అభివృద్ధి చేస్తామని కమీషన్ నిపుణులు భరోసా ఇచ్చారు.  ఇప్పటికే అందుబాటులో ఉన్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్‌పై ఆధారపడి ఉంటుందని,  ఇంటర్‌నెట్‌కు కనెక్ట్ అవదని స్పష్టం చేసింది.
 
సోమవారం జాతీయ, ప్రాంతీయ పార్టీలతో భేటీ అయిన ఎన్నికల కమీషన్ ఆర్‌వీఎం పనితీరును రాజకీయ పార్టీల ప్రతినిధులకు ప్రదర్శించింది. ఇంటి వద్ద కాకుండా దూరంగా ఉండేవారు ఓటు హక్కు వినియోగించునేలా సిద్ధం చేసిన ఈ వ్యవస్థ డెమోకు 8 గుర్తింపు పొందిన జాతీయ పార్టీలు, 57 ప్రాంతీయ పార్టీలను ఎన్నికల కమిషన్ పిలిచింది.
 
రిమోట్ ఈవీఎంల ప్రదర్శన సందర్భంగా ఎన్నికల సంఘం సాంకేతిక నిపుణుల కమిటీ సభ్యులు.. ఆర్‌వీఎంల పనితీరుకు సంబంధించి వివరించారు. రిమోట్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ సాయంతో ఇంటి నుంచి దూరంగా నివసిస్తున్న ఓటర్లు ఎన్నికల్లో ఓటు వేయవచ్చని కమిషన్ స్పష్టం చేసింది.
 
ఈ కొత్త మెషిన్ల ప‌నితీరు, ఎన్నిక‌ల విధానంలో తీసుకురావల్సిన మార్పులు, వ‌ల‌స కూలీలు ఓటు హక్కు వినియోగం.. తదితరాలపై అభిప్రాయాలను రాత పూర్వకంగా ఈ నెల 31వ తేదీ లోపు తెలియ‌జేయాల‌ని ఈసీ సూచించింది. సుదూర బూత్‌లలో పోలైన ఓట్ల లెక్కింపు, ఇతర రాష్ట్రాల్లోని బూత్‌ల రిటర్నింగ్ అధికారులను పంపడం సాంకేతిక సవాలు అని ఎన్నికల సంఘం అధికారులు పేర్కొంటున్నారు.
 
 గత నెల 29 న ఆర్‌వీఎం నమూనా మెషిన్‌ను ఈసీ ప్రదర్శించింది. ఈ విధానం అమల్లోకి వ‌స్తే వ‌ల‌సకూలీలు ఓటేయడానికి వారి స్వగ్రామాలకు వెళ్లాల్సిన అవ‌స‌రం ఉండ‌ద‌ని, ఫలితంగా ఓటింగ్ శాతం పెరుగుతుంద‌ని ఎన్నిక‌ల సంఘం భావిస్తున్నది. ఈ విధానంతో ఒక పోలింగ్‌ బూత్‌ నుంచి 72 నియోజకవర్గాల ఎన్నికల ఓటింగ్‌ను నిర్వహించవచ్చునని ఈసీ చెప్తుండటం విశేషం.
 
అయితే, ఈ వ్యవస్థను ప్రవేశపెట్టే ప్రయత్నాలను కాంగ్రెస్‌తో పాటు 16 ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకించాయి. ఈ ప్రతిపాదనపై చర్చించేందుకు కాంగ్రెస్ ఆదివారం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించింది. దిగ్విజయ్ సింగ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జేడీయూ, శివసేన ఉద్ధవ్ వర్గం, నేషనల్ కాన్ఫరెన్స్, సీపీఎం, జేఎంఎం, ఆర్జేడీ, పీడీపీ, వీసీకే, ఆర్‌యూఎంఎల్, ఎన్సీపీ, ఎస్పీ సహా 16 పార్టీలు పాల్గొన్నాయి. ఈ సమావేశంలో పాల్గొన్న పార్టీలన్నీ ఆర్‌వీఎం ప్రతిపాదనను వ్యతిరేకించడం విశేషం.