కేరళలో ఆరోగ్య రంగంపై జి20 బృందం సమావేశం 

భారతదేశం అధ్యక్షత వహిస్తున్న జీ-20 లో ఆరోగ్య రంగంపై ఏర్పాటైన వర్కింగ్ గ్రూప్ తొలిసారిగా కేరళలోని తిరువనంతపురంలో జనవరి 18 నుంచి 20 వరకు  సమావేశం కానున్నది. జీ-20 ఆరోగ్య రంగం  వర్కింగ్ గ్రూప్  సమావేశాలు నాలుగు సార్లు, ఆరోగ్య మంత్రుల సమావేశం ఒకసారి జరుగుతాయి. ఈ సమావేశాలు తిరువనంతపురం (కేరళ), గోవా, హైదరాబాద్ (తెలంగాణ), గాంధీనగర్ (గుజరాత్) సహా దేశవ్యాప్తంగా వివిధ ప్రదేశాలలో జరుగుతాయి.

భారతదేశ  విభిన్న సంస్కృతులు ప్రపంచ దేశాలకు తెలియజేయాలన్న లక్ష్యంతో దేశం వివిధ ప్రాంతాల్లో సమావేశాలు ఏర్పాటు చేయాలని  ప్రధానమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు. వర్కింగ్ గ్రూప్ సమావేశాలతో పాటు అనుబంధ అంశాలపై సమావేశాలు నిర్వహించి జీ-20 సమావేశాలు అర్ధవంతంగా జరిగి నిర్ణయాలు సక్రమంగా అమలు జరిగేలా చూడాలని భారతదేశం నిర్ణయించింది.

విలువ ఆధారిత వైద్య పర్యాటకం,  డిజిటల్ ఆరోగ్య రంగం అంశాలపై అనుబంధ సమావేశాలు నిర్వహించాలని భారతదేశం నిర్ణయించింది. ఔషధ అభివృద్ధి, వ్యాధి నిర్ధారణ పరీక్షలు, వ్యాక్సిన్‌లపై  పరిశోధనపై దేశాల మధ్య ఒక వర్క్‌షాప్, సాంప్రదాయ వైద్య అంశాలపై ప్రపంచ స్థాయి కేంద్రాన్ని అభివృద్ధి చేయడం లక్ష్యంగా అనుబంధ సమావేశాలు జరుగుతాయి.

జనవరి 18-20 తేదీల్లో తిరువనంతపురంలో జరగనున్న వర్కింగ్ గ్రూప్ మొదటి సమావేశం సందర్భంగా విలువ ఆధారిత వైద్య పర్యాటక అంశంపై అనుబంధ సమావేశం జరుగుతుంది.   ఆరోగ్య అంశాలకు ప్రాధాన్యతలను కొనసాగిస్తూ మునుపటి అధ్యక్షుల హయాంలో అసంపూర్తిగా మిగిలిపోయిన కార్యక్రమాలను పూర్తి చేయడానికి జీ-20 అధ్యక్ష హోదాలో ప్రాధాన్యత ఇవ్వాలని భారతదేశం నిర్ణయించింది.

ముఖ్యమైన క్లిష్టమైన అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని కూడా భారతదేశం నిర్ణయించింది.  ఏకీకృత విధానం ద్వారా లక్ష్యం సాధించాలని భారతదేశం భావిస్తోంది.  ఆరోగ్య రంగంలో వివిధ దేశాల మధ్య సహకారం,  వివిధ బహుపాక్షిక వేదికల మధ్య చర్చలు సాగించి సమీకృత సమగ్ర లక్ష్యం సాధించాలని భారతదేశం  లక్ష్యంగా పెట్టుకుంది.

ఆరోగ్య అత్యవసర పరిస్థితుల నివారణ, సంసిద్ధత, ప్రతిస్పందన (ఒక ఆరోగ్యం & ఏఎంఆర్ పై ప్రత్యేక దృష్టి సారించడం); సురక్షితమైన, సమర్థవంతమైన, నాణ్యమైన, సరసమైన వైద్యపరమైన అంశాలు అందుబాటులోకి తెచ్చి  (వ్యాక్సిన్‌లు, థెరప్యూటిక్స్ మరియు డయాగ్నోస్టిక్స్) అవసరాల మేరకు సరఫరా చేయడం; సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ సాధించడానికి, ఆరోగ్య సేవలను  మెరుగుపరచడానికి డిజిటల్ ఆరోగ్య సేవల అభివృద్ధి, నూతన ఆవిష్కరణలను ప్రాధాన్యత అంశాలుగా భారత్ నిర్ణహాయించింది.
ఈ ప్రాధాన్యత అంశాలపై వర్కింగ్ గ్రూప్ సమావేశంలో  ప్రాథమిక చర్చలు జరుగుతాయి.  ఈ సమావేశానికి జీ-20 సభ్య దేశాల ప్రతినిధులు, ప్రత్యేక ఆహ్వానిత దేశాలు, సంబంధిత అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు హాజరవుతారు.