శక్తిమంతమైన ప్రభుత్వాలు లేకపోతే ప్రతి చోటా అఫ్తాబ్‌లే

శక్తిమంతమైన ప్రభుత్వాలు లేకపోతే ప్రతి చోటా అఫ్తాబ్‌లే

ఢిల్లీలో జరిగిన శ్రద్ధా వాల్కర్  హత్యపై అస్సాం ముఖ్యమంత్రి  హిమంత బిశ్వశర్మ దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తూ లవ్ జిహాద్ పేరిట ముంబై నుంచి శ్రద్ధాను ఢిల్లీకి తీసుకుపోయిన అఫ్తాబ్‌ 35 ముక్కలు చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రద్ధా డెడ్‌బాడీ ఫ్రిడ్జ్‌లో ఉండగానే మరో మహిళను ఫ్లాట్‌కు పిలుచుకుని డేటింగ్ చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇంకెంత కాలం ఇలాంటి అఫ్తాబ్‌లు పుట్టుకొస్తారని ఆయన ప్రశ్నించారు. శక్తిమంతమైన ప్రభుత్వాలు లేకపోతే ప్రతి చోటా ఇలాంటి అఫ్తాబ్‌లే పుడతారని హెచ్చరించారు. అతి త్వరలో యూనిఫామ్ సివిల్ కోడ్ రాబోతోందని, దీని ద్వారా ముస్లిం మహిళలకు న్యాయం జరుగుతుందని చెప్పారు.

యూసీసీ ద్వారా ఇకపై ముస్లిం పురుషులు మూడు, మూడు వివాహాలు చేసుకోవడం కుదరదని స్పష్టం చేశారు. ట్రిపుల్ తలాక్ తరహాలోనే యూసీసీ ద్వారా కూడా ముస్లిం సోదరీమణులకు న్యాయం లభిస్తుందని భరోసా ఇచ్చారు. ఇకపై ముస్లిం మహిళలను ఆటబొమ్మలుగా చూడటం కుదరదని హిమంత బిశ్వశర్మ చెప్పారు. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన గాంధీధామ్‌లో ఈ వ్యాఖ్యలు చేశారు.

మరోవైపు అఫ్తాబ్‌‌ను ఐదు రోజుల్లోపే నార్కో అనాలిసిస్ టెస్టులు  చేయాలని సాకేత్ కోర్టు ఆదేశించింది. అఫ్తాబ్‌‌ పోలీసు కస్టడీని కోర్టు మరో ఐదు రోజులు పొడిగించింది. అఫ్తాబ్, శ్రద్ధా గతంలో ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌కు కూడా వెళ్లడంతో ఢిల్లీ పోలీసులు అతడిని ఆ రాష్ట్రాలకు తీసుకెళ్లనున్నారు. అంతేకాదు శ్రద్ధా స్నేహితుల దగ్గరకు కూడా అఫ్తాబ్‌ను తీసుకెళ్తారు.

ఢిల్లీలోని మెహ్రౌలీ ప్రాంతంలో ఉన్న ఫ్లాటులో అఫ్తాబ్‌ మే 18న శ్రద్ధాను చంపేశాడు. ఆ మరుసటి రోజు పది గంటల పాటు శ్రమించి ఆమె శరీరాన్ని 35 ముక్కలుగా చేశాడు. ముక్కలుగా కోసేముందు శ్రద్ధా శవంపై వేడినీళ్లు పోశాడు. సులభంగా కోసేందుకు అవకాశం ఉంటుందని అలా వేడినీళ్లు పోసినట్లు అఫ్తాబ్ పోలీసులకు తెలిపాడు.

35 ముక్కలను 18 ప్యాకుల్లో అమర్చాడు. ఒక్కో ప్యాక్‌ను ఒక్కోరోజు చొప్పున 18 రోజుల పాటు రాత్రి 2 గంటల సమయంలో మెహ్రౌలీ అటవీ ప్రాంతంలో పడేశాడు. శ్రద్ధా తండ్రి నవంబర్ 11న పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

శ్రద్ధాను ఆరు నెలల క్రితమే దారుణంగా చంపి ఏమీ తెలియనట్లుగా ఉంటోన్న అఫ్తాబ్‌ను అరెస్ట్ చేసి విచారణ జరపడంతో చేసిన ఘాతుకాన్ని ఒప్పుకున్నాడు. పోలీసులు ఇప్పటివరకూ శ్రద్ధాకు చెందిన 13 ఎముకలను మెహ్రౌలీ అటవీ ప్రాంతం నుంచి స్వాధీనం చేసుకున్నారు. డీఎన్‌ఏ పరీక్షల ద్వారా వీటిని గుర్తిస్తారు. ఈ హత్య కేసులో ఆధారాలు సేకరించడం పోలీసులకు సవాలుగా మారుతుంది.