
సింగరేణిని కేంద్రం ప్రైవేటు పరం చేస్తుందని కొందరు హైదరాబాద్ నుంచి ప్రజలను రెచ్చగొడుతున్నారని మండిపడుతూ సింగరేణి బొగ్గు గనులపై రాష్ట్ర ప్రభుత్వం చెప్పే పుకార్లను నమ్మవద్దని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ ప్రజలకు స్పష్టం చేశారు. సింగరేణిని ప్రైవేటు పరం చేసే ప్రసక్తే లేదని పేర్కొంటూ ఆ అధికారం కేంద్రానికి లేదని తేల్చి చెప్పారు.
సింగరేణిలో తెలంగాణ ప్రభుత్వ వాటా 51 శాతం ఉండగా..కేంద్రానికి 49 శాతం వాటా మాత్రమే ఉందని ప్రధాని గుర్తు చేశారు. ఈ విషయంలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా.. రాష్ట్ర ప్రభుత్వమే తీసుకోవాలని పేర్కొన్నారు. సింగరేణిలో గతంలో అనేక కుంభకోణాలు జరిగాయని విమర్శించా రు.
రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ఆర్ఎఫ్ సీఎల్ తోపాటు రూ.9500 కోట్ల విలువైన జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులను ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు. అనంతరం నిర్వహించిన సభలో ప్రధాని మాట్లాడుతూ రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభం వల్ల రైతులకు ఎరువుల కొరత తీరిందని చెప్పారు.
గతంలో ఎరువుల కోసం విదేశాలపై ఆధారపడేవాళ్లమని చెప్పారు. కానీ ప్రస్తుతం దేశంలో గోరఖ్ పూర్ , రామగుండంతో పాటు..మరో 5 ప్రాంతాల్లో ఎరువుల ఉత్పత్తి జరుగుతోందని, దీని వల్ల భారతే ప్రపంచ దేశాలకు ఎరువులను ఎగుమతి చేస్తోందని తెలిపారు. దేశంలో ఫర్టిలైజర్ సెక్టార్ను ఎంతో అభివృద్ధి చేశామని పేర్కొన్నారు.
గతంలో యూరియా కోసం రైతులు అర్థరాత్రి వరకు క్యూలైన్లలో నిల్చునేవారని, యూరియా కోసం రైతులు లాఠీ దెబ్బలు కూడా తిన్నారని ప్రధాని గుర్తు చేశారు. ప్రస్తుతం దేశంలో వ్యవసాయానికి సరిపడా యూరియా ఉత్పత్తి అవుతోందని స్పష్టం చేశారు. దేశంలో యూరియా బ్లాక్ మార్కెట్ను అరికట్టామని చెప్పారు.
ప్రపంచ దేశాల్లో ఎరువుల రేట్లు పెరిగినా భారత్లో మాత్రం ఎరువుల రేట్లను పెంచలేదని, పైగా ఎరువుల రేట్లను తగ్గించామని ప్రధాని గుర్తు చేశారు. గతంలో నకిలీ ఎరువుల వల్ల రైతులు ఇబ్బంది పడ్డారని..వాటన్నింటిని రద్దు చేశామని చెప్పారు. ప్రస్తుతం దేశంలో భారత్ బ్రాండ్ ఎరువులు మాత్రమే అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
బీజేపీ ప్రభుత్వం వచ్చాక..దేశంలో అన్ని రంగాల్లో సంస్కరణలు తీసుకొచ్చామని ప్రధాని మోదీ తెలిపారు. 24 గంటల పాటు దేశాభివృద్ధి కోసమే పరితపిస్తున్నామని స్పష్టం చేశారు. కరోనా ప్రపంచ దేశాలను ఎంతో ఇబ్బంది పెట్టిందని..దీని వల్ల దేశం కూడా తీవ్ర ఇబ్బందులకు గురైందని పేర్కొన్నారు. ఈ కష్టకాలంలోనూ ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా దేశం అవతరించిందని ప్రధాని గుర్తు చేశారు.
ఎనిమిదేండ్లుగా సుపరిపాలన అందిస్తున్నామని పేర్కొంటూ దీనికి రామగుండం ఎరువుల ఫ్యాక్టరీయే నిదర్శమని చెప్పారు. రైతులకు ఇప్పటి వరకు రూ. 10 లక్షల కోట్లు ఖర్చుచేశామని మోదీ వెల్లడించారు. రాబోయే రెండున్నరేండ్లలో మరో రూ. 2.5 లక్షల కోట్లు ఖర్చు చేస్తామని తెలిపారు.
తెలంగాణలో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలను కలిపే రైల్వే లైన్ను ప్రారంభించామని ప్రధాని మోదీ తెలిపారు. వీటితో పాటు జాతీయ రహదారులను ప్రారంభించామని చెప్పారు. రైల్వే లైన్లు, జాతీయ రహదారుల ప్రారంభం వల్ల రాష్ట్రంలో ఎంతో మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు.
తెలంగాణలో ఇవాళ రూ. 10 వేల కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించామని గుర్తు చేస్తూ తెలంగాణ అభివృద్ధి కోసం బీజేపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని ప్రధాని చెప్పారు.
More Stories
ప్రత్యేక దేశంగా పాలస్తీనా .. భారత్ సంపూర్ణ మద్దతు
నేపాల్ తొలి మహిళా ప్రధానిగా సుశీలా కర్కి
భారత్ లక్ష్యంగా కొత్త చట్టానికి ట్రంప్ ప్రతిపాదన