ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో పెద్ద వ్యక్తుల ప్రమేయం

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో పెద్ద వ్యక్తుల ప్రమేయం

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో పెద్ద వ్యక్తుల ప్రమేయం ఉందని సీబీఐ స్పష్టం చేసింది. ఈ కేసులో రిమాండ్‌లో ఉన్న బోయినపల్లి అభిషేక్‌రావు సాక్ష్యాధారాలను తారుమారు చేయగల వ్యక్తి అని తెలిపింది. అభిషేక్‌ బెయిలు పిటిషన్‌పై ఢిల్లీలోని రౌజ్‌ అవెన్యూ కోర్టులో శుక్రవారం విచారణ సందర్భంగా సీబీఐ ఈ మేరకు వాదనలు వినిపించింది.

బెయిలు పిటిషన్‌పై జడ్జి ఎంకే నాగ్‌పాల్‌ విచారణ జరిపారు. సీబీఐ తరఫున న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. ‘‘ఆయన చాలా ప్రభావితం చేయగల వ్యక్తి. ఇది హై ప్రొఫైల్‌ కేసు. ఇందులో పెద్ద పెద్ద వ్యక్తుల ప్రమేయం ఉంది. అభిషేక్‌ కచ్చితంగా దర్యాప్తును ప్రభావితం చేయగలరు. సాక్ష్యాధారాలను తారుమారు చేయగలరు. కాబట్టి బెయిల్‌ ఇవ్వొద్దు’’ అని విజ్ఞప్తి చేశారు.

అభిషేక్‌ తరఫు న్యాయవాదులు వాదిస్తూ.. ఎఫ్‌ఐఆర్‌లో అభిషేక్‌ పేరు లేదని, అయినా గత నెల 22 నుంచి ఈ నెల 9 వరకు చాలా సార్లు విచారించిన సీబీఐ, చివరికి 9న అరెస్టు చేసిందని గుర్తు చేశారు. వాంగ్మూలం ఇచ్చిన తర్వాత కేసు దర్యాప్తులో ఎటువంటి మార్పు లేదని, జ్యుడీషియల్‌ కస్టడీ అవసరం లేదని పేర్కొన్నారు.

అభిషేక్‌ దర్యాప్తును ప్రభావితం చేసేంత పెద్ద వ్యక్తి కాదని తెలిపారు. ఆధారాలను తారుమారు చేస్తారన్న సీబీఐ ఆరోపణల్లో వాస్తవం లేదని తెలిపారు. కాగా, డబ్బుల లావాదేవీలు జరిగాయన్న సీబీఐ వాదనపై మీ వివరణ ఏంటి? అని జడ్జి ప్రశ్నించగా.. అభిషేక్‌ చట్టబద్ధంగా వ్యాపారం చేసే వ్యక్తి అని, లావాదేవీలన్నీ బ్యాంకు ద్వారానే జరిగాయని బదులిచ్చారు.

అభిషేక్‌ ఏం వ్యాపారం చేస్తారు? అని జడ్జి ప్రశ్నించగా బ్యూటీ పార్లర్ల చైన్‌ వ్యాపారం ఉందని సమాధానమిచ్చారు. ముత్తా గౌతమ్‌కు సంబంధించిన రూ. 1.7 కోట్ల మేర లావాదేవీలు ఎందుకు జరిగాయి? అని జడ్జి ప్రశ్నించారు. ముత్తా గౌతమ్‌తో అభిషేక్‌కు చాలా కాలంగా వ్యాపార సంబంధాలున్నాయని న్యాయవాదులు పేర్కొన్నారు.

‘‘ముత్తా గౌతమ్‌కు చెందిన ఇండియా ఎహెడ్‌ చానెల్‌ లోగోను కొనుగోలు చేశారు. అంతేతప్ప ఆ కంపెనీలో అభిషేక్‌కు భాగస్వామ్యం ఉందని సీబీఐ చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదు. లోగో కొనుగోలుకు పెట్టుబడి మాత్రమే పెట్టారు” అంటూ చెప్పుకొచ్చారు.

అయితే,  సీబీఐ న్యాయవాదులు జోక్యం చేసుకొంటూ లోగో కొనుగోలు చేశారంటున్నారని, అసలు లోగో లేనిదే టీవీ చానెల్‌ను నడపలేరని పేర్కొన్నారు. కాగా, ఈ నెల 9న కేసులోని మరో నిందితుడు విజయ్‌ నాయర్‌ బెయిల్‌ పిటిషన్‌ తమ ముందుకు రానుందని, దాంతో కలిపి అభిషేక్‌ పిటిషన్‌ను విచారిస్తామని జడ్జి స్పష్టం చేశారు. తదుపరి విచారణను 9కి వాయిదా వేశారు