ఫాం హౌస్ కేసు దర్యాప్తుపై హైకోర్టు స్టే

ఫాం హౌస్ కేసు దర్యాప్తుపై హైకోర్టు స్టే
ఫాం హౌస్ కేసులో బీజేపీ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తుపై స్టే విధించింది. నవంబర్ 4వ తేదీ వరకు పోలీసులు ఎలాంటి దర్యాప్తు చేయవద్దని ఆదేశించింది. ఫాం హౌస్ కేసులో ప్రతివాదులుగా ఉన్న  8 మందికి కోర్టు నోటీసులు జారీ చేసింది.
నలుగురు టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కేసులో నిందితులైన రామచంద్ర భారతి అలియాస్‌ సతీశ్‌ శర్మ, కోరె నందు కుమార్‌ అలియాస్‌ నందు, డీపీఎస్‌కేవీఎన్‌ సింహయాజిలను సైబరాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి సిట్‌ లేదా సిబిఐతో దర్యాప్తు చేయించాలని బిజెపి పిటిషన్‌ వేసింది. 
 
ఆ పిటిషన్‌పై ఈరోజు విచారణ చేపట్టిన హైకోర్టు మునుగోడు ఎన్నికలయ్యే వరకు కేసు దర్యాప్తును ఆపాలని ఆదేశించింది.  పోలీసులు 4వ తేదీలోపు కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు స్పష్టం చేసింది.   కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వానికి న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.
బీజేపీ పార్టీ ప్రతిష్ఠ దెబ్బతినేలా వ్యవహరిస్తున్నారంటూ రిట్ పిటిషన్ దాఖలు చేసింది.  మునుగోడు  ఉప ఎన్నికల నేపధ్యంలో  తమ పార్టీకి వస్తున్న ఆదరణ  చూడలేకనే  టీఆర్ఎస్ కుట్ర చేసిందని పిటిషన్లో చెప్పింది.  ఈ పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం బీజేపీ తరఫు న్యాయవాది వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి మునుగోడు ఎన్నిక ముగిసే వరకు పోలీసు దర్యాప్తుపై స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
మరోవైపు, ఈ కేసుకు సంబంధించి ముగ్గురు నిందితులను రిమాండ్‌కు అప్పగించాలంటూ సైబరాబాద్ పోలీసులు వేసిన రివిజన్ పిటిషన్‌కు హైకోర్టు అనుమతించింది. ప్రభుత్వ అప్పీల్‌ను న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుంది. నిందితులను మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చాలని హైకోర్టు ఆదేశించింది. 
 
కాగా… ముగ్గురు నిందితులకు రిమాండ్‌ విధించడానికి నిరాకరిస్తూ, పోలీసుల రిమాండ్‌ రిపోర్ట్‌ను హైదరాబాద్‌ ఏసీబీ కోర్టు  కొట్టివేసిన నేపథ్యంలోఆ తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది.