పగటి కలలతో కాలక్షేపం చేస్తున్న కేసీఆర్

పగటి కలలతో కాలక్షేపం చేస్తున్న కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీరు చూస్తుంటే లేనివి ఉన్నట్లు ఊహించుకుంటూ పగటి కలలతో కాలక్షేపం చేస్తున్నట్టు అనిపిస్తోందని బీజేపీ జాతీయ  కార్యవర్గ సభ్యురాలు, మాజీ ఎంపీ విజయశాంతి మండిపడ్డారు. మొన్నే పేరు మార్చిన తన బీఆరెస్ (టీఆరెస్) దేశంలో అధికారంలోకి వచ్చేసినట్టు… అప్పుడే తను ఢిల్లీ సుల్తాన్ అయిపోయినట్టు కేసీఆర్ ఫీలైపోతున్నారని, ఆయన చేష్టలు చూస్తుంటే తెలుస్తోందని ఆమె విమర్శించారు.
 
 తెలంగాణకే ఏమీ చెయ్యని ఈ పెద్దమనిషి ఇప్పుడు ఢిల్లీ నుంచి కూడా తీరిక లేకుండా రాష్ట్రానికి ఏదో ఒరగబెట్టేస్తున్నట్టు బిల్డప్ ఇచ్చేస్తున్నారని ఆమె ఎద్దేవా చేశారు. అసలు కేసీఆర్ ఢిల్లీ ఎందుకెళ్లారో ఎవరికీ తెలీదు సరికదా, ఒంట్లో బాగా లేదంటూ అక్కడే తిష్టవేసి, తెలంగాణ వ్యవహారాలపై ప్రేమ కారిపోతున్నట్టు సీఎస్, డీజీపీ, ఐ అండ్ పీఆర్ కమిషనర్‌తో పాటు ఇంకొందరు ఉన్నతాధికారులను ఢిల్లీ రమ్మని కబురుపెట్టారని ఆమె ధ్వజమెత్తారు.
 
కేసీఆర్ అంతగా కదల్లేని పరిస్థితుల్లో ఉంటే ఆస్పత్రిలో ఎందుకు చేరలేదు? ఒకవేళ అంతగా రాష్ట్ర అధికారులతో మాట్లాడాలంటే ఆన్‌లైన్ కాన్ఫరెన్స్‌లు నిర్వహించి కూడా ఆదేశాలివ్వచ్చు. అంతేతప్ప ఎవడబ్బ సొమ్మని కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని తన కోసమే గాక, అధికారుల విమాన యాత్రలు, వసతి కోసం దుర్వినియోగం చెయ్యాలి? అని ఆమె ప్రశ్నించారు.
 
ఢిల్లీ మద్యం పాలసీ స్కాం తన పీకకి పట్టుకుంటుందనే భయం ఒకవైపు, మునుగోడులో బీఆరెస్ (టీఆరెస్) ఓటమి తప్పని వాతావరణం మరోవైపు, ఇక బీఆర్ఎస్ బీటలు వారక తప్పని పరిస్థితుల్ కనీసం ఢిల్లీ నుంచి దేశాన్ని పాలిస్తున్నానన్న ఫీల్ కోసం ఈ నయా నిజాం కేసీఆర్ పడుతున్న ఈ పాట్లు, పోకడ చూసి ప్రజలు నవ్వుకుంటున్నరని ఆమె పేర్కొన్నారు.