స్కాట్లాండ్లోని బాల్మోరల్ ఎస్టేట్లో క్వీన్ ఎలిజబెత్ II ద్వారా లిజ్ ట్రస్ (47)ను బ్రిటన్ తదుపరి ప్రధానమంత్రిగా నియమించారు. బోరిస్ జాన్సన్ అధికారికంగా తన రాజీనామాను అందించడానికి చక్రవర్తిని కలిసిన కొద్దిసేపటికే కొత్త ప్రధానిగా లిజ్ ట్రస్ ను నియమించారు. అంతకు ముందు బోరిస్ జాన్సన్ (58) ఆమెకు తన రాజీనామాను సమర్పించారు.
సంప్రదాయాన్నికాదని క్వీన్ ఎలిజబెత్ 70 ఏళ్ల పాలనలో లండన్లోని బకింగ్హామ్ ప్యాలెస్లో కాకుండా, బాల్మోరల్లో అధికార అప్పగింత జరగడం ఇదే తొలిసారి. వేడుక ప్రదేశంలో మార్పు 96 ఏళ్ల రాణి ఆరోగ్యంపై పుకార్లకు దారితీసింది. ఆమె హయాంలో ట్రస్ 15వ ప్రధాని కావడం విశేషం. మొదటిసారిగా, 1952లో చర్చల్ ను ఆమె ప్రధానిగా నియమించారు.
భారత సంతతికి చెందిన మాజీ ఛాన్సలర్ రిషి సునక్పై గట్టి పోటీలో బ్రిటన్ కన్జర్వేటివ్ పార్టీ 172,000 మంది సభ్యులు ఆమెను తమ నాయకురాలిగా ఎన్నుకున్న ఒక రోజు తర్వాత లిజ్ ట్రస్ బాధ్యతలు చేపట్టారు.
‘‘కొత్త పరిపాలనను ఏర్పాటు చేయమని లిజ్ ట్రస్ ను రాణి ఎలిజెబెత్ అభ్యర్థించారు” అని బకింగ్హామ్ ప్యాలెస్ ఒక ప్రకటనలో తెలిపింది. “మిసెస్ ట్రస్ రాణి గారి ప్రతిపాదనను అంగీకరించారు. ఆమె చేతులను ముద్దాడారు” అని ప్రకటన జోడించింది.
కాగా, బ్రిటన్ ను సంక్షోభం నుండి బయటపడేసేందుకు తన వద్ద సాహసోపేత ప్రణాళికలు ఉన్నాయని ప్రధానిగా పదవి చేపట్టిన అనంతరం అధికార నివాసం నుండి తొలి ప్రసంగం చేస్తూ ట్రస్ ప్రకటించారు. పన్ను కోతలు, సంస్కరణలతో ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టిస్తానని తెలిపారు. అత్యంత కీలక సమయంలో దేశ సారథ్య బాధ్యతలను చేపట్టడం చాలా గౌరవంగా భావిస్తున్నట్లు ఆమె చెప్పారు.
More Stories
ఉక్రెయిన్ పై రష్యా రసాయన ఆయుధాల ప్రయోగం!
విదేశీ విద్యార్థులకు కెనడా వారానికి 24 గంటలే వర్క్ పర్మిట్
ఆఫ్ఘన్ షియా మసీదులో కాల్పులు.. ఆరుగురు మృతి