ఆధార్‌తో ఓటర్‌ కార్డు అనుసంధానం..విచారణకు `సుప్రీం’ నిరాకరణ

ఆధార్‌తో ఓటర్‌ కార్డు అనుసంధానం..విచారణకు `సుప్రీం’ నిరాకరణ
ఆధార్‌తో ఓటర్‌ కార్డును అనుసంధానం చేసే వివాదాస్పద ఎన్నికల సవరణ చట్టాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో కాంగ్రెస్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాలని కాంగ్రెస్‌ నేత రణదీప్‌ సూర్జేవాలాకు సూచించింది. 
 
ఎన్నికల సవరణ చట్టంలోని సెక్షన్‌ 4, 5ల చట్టబద్ధను సవాలు చేస్తూ ఢిల్లీ హైకోర్టులో పలు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలై ఉన్నాయని, కావున అక్కడ దీనికి ప్రత్యామ్నాయ పరిష్కారం దొరకవచ్చునని అత్యున్నత న్యాయస్థానం తెలిపింది.
 
 ఆర్టికల్‌ 226 ప్రకారం హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసేందుకు స్వేచ్ఛనిస్తున్నామని జస్టిస్‌ డివై చంద్రచూడ్‌, ఎఎస్‌ బప్పన్న నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. ఆధార్‌తో ఓటర్‌ ఐడి అనుసంధానించేలా ఎన్నికల సవరణ బిల్లును గత ఏడాది డిసెంబర్‌లో కేంద్రం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టగా ఆమోదం పొందింది.
ప్రాథమిక హక్కుల ఉల్లంఘనతో పాటు పౌరుల గోప్యతకు భంగం కలిగిస్తుందని, ఇది రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ  సూర్జేవాలా సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.