
కాళేశ్వరం భారీ ప్రాజెక్టు గోదావరి వరద ఉధృతికి అల్లకల్లోలమైంది. నీటిని లిఫ్ట్ చేసే కన్నెపల్లి, దానికి పైనున్న అన్నారం పంపుహౌస్లు పూర్తిగా మునిగిపోయాయి. రెండు పంపుహౌసుల్లో కలిపి 29 బాహుబలి మోటార్లు, వాటిని ఆపరేట్ చేయాల్సిన ఎలక్ట్రో మెకానికల్ ఎక్విప్మెంట్, కంట్రోల్ ప్యానళ్లు, కంప్యూటర్లు, రెండు భారీ ఎయిర్ కండిషన్ సిస్టమ్లు, రెండు స్కాడా సిస్టమ్లు, సబ్ స్టేషన్లు ఇట్లా అన్నీ వరదలో కనిపించకుండాపోయాయి.
దీంతో వందల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. ఇందుకు డిజైన్, మెయింటనెన్స్ లోపాలే ప్రధాన కారణమని రిటైర్డ్ ఇంజనీర్లు అంటున్నారు. పరిస్థితిని ముందే హెచ్చరించినా పట్టించుకోకపోవడంతోనే ఇన్ని కోట్ల ప్రజాధనం వరద పాలైందని చెప్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక్కొక్కటిగా నిర్మాణ లోపాలు బయట పడుతున్నాయి.2019 ఆగస్టులో లక్ష్మీపూర్ పంప్హౌస్ ప్రొటెక్షన్ వాల్ దెబ్బతిని నీళ్లు లీకయ్యాయి
.అదే ఏడాది సెప్టెంబర్ 3న కన్నెపల్లి పంప్హౌస్ ప్రొటెక్షన్ వాల్ దెబ్బతిని మోటార్లపైకి నీళ్లు చేరాయి. మూడో టీఎంసీ పనులు చేస్తున్న టైంలోనూ ప్రొటెక్షన్ వాల్ దెబ్బతింది. 2019 అక్టోబర్ 9న అన్నారం బ్యారేజీ గేట్లలో లీకేజీలు ఏర్పడ్డాయి.2020 ఆగస్టు 23న కొద్దిపాటి వర్షాలకే కాళేశ్వరం దగ్గర గ్రావిటీ కెనాల్ లైనింగ్ కూలింది.
మిడ్ మానేరు నింపడంలో ప్రొటోకాల్ పాటించకపోవడంతో 2019 సెప్టెంబర్లో ఆ ప్రాజెక్టు కట్టకు బుంగ పడింది. అన్నారం పంపుహౌస్ నుంచి నీటిని సరఫరా చేసే పైపులైన్ నిరుడు జులై 28న భారీ వర్షాలతో భూమిలోంచి పైకితేలింది.నిరుడు సెప్టెంబర్ 27న సుందిళ్ల బ్యారేజీ కట్ట దెబ్బతింది.
అన్నారం పంపుహౌస్ను బుధవారం రాత్రే వరద చుట్టుముట్టింది. పంపుహౌస్లోకి నీళ్లు ప్రవేశించకుండా స్థానిక సిబ్బంది ప్రయత్నించినా సాధ్యం కాలేదు. దీంతో వాళ్లు పంపుహౌస్ నుంచి బయటపడి ప్రాణాలు రక్షించుకున్నారు. కన్నెపల్లి పంపుహౌస్లోకి నీళ్లు వెళ్లకుండా నియంత్రించాల్సిన బ్రెస్ట్ వాల్ కూలిపోవడంతో గురువారం మధ్యాహ్నం ఆ పంపుహౌస్ మునిగిపోయింది. ఇందులో పనిచేసే ఇంజనీర్లు, ఇతర స్టాఫ్ వెంటనే బయటకు రావడంతో ప్రాణాపాయం తప్పింది.
భారీ వర్షాలకు గోదావరి నది మహోద్రంగా ప్రవహిస్తుండటంతో ఎస్సారెస్పీ నుంచి మొదలుపెట్టి అన్నారం బ్యారేజీ వరకు అన్ని ప్రాజెక్టుల గేట్లు ఎత్తారు. దీంతో బుధవారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో అన్నారం పంపుహౌస్ను వరద చుట్టుముట్టింది. గోదావరి నిండుగా ప్రవహిస్తుండటంతో జల్లారం వాగు నీళ్లు ఎగతన్నాయి. అవి వెళ్లడానికి మార్గం లేకపోవడంతో అన్నారం పంపుహౌస్ వైపు పరుగులు పెట్టాయి.
నిరుడు అన్నారం పంపుహౌస్లోకి ఇదే వాగు నుంచి నీళ్లు చేరడంతో పంపుహౌస్ చుట్టూ(బయట) 129 మీటర్ల ఎత్తయిన ప్రొటెక్షన్ వాల్ (మట్టికట్ట) నిర్మించారు. బుధవారం రాత్రి గోదావరిలో ప్రవాహం పెరగడంతో ఆ నీళ్లు అన్నారం పంపుహౌస్ వైపే వచ్చాయి. దీంతో మట్టికట్ట తెగి పంపుహౌస్ నీట మునిగింది. పంపుహౌస్ వైపు వస్తున్న నీటిని లోపలికి రాకుండా ఫోర్బే వైపు మళ్లించేందుకు అక్కడి సిబ్బంది కొంతసేపు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. పంపుహౌస్తో పాటు సబ్ స్టేషన్ నీట మునిగింది.
కన్నెపల్లి పంపుహౌస్కు గోదావరి నుంచి నీటిని తీసుకుని హెడ్ రెగ్యులేటర్ ద్వారా ఫోర్బేకు తరలిస్తారు. పంపుహౌస్లోని బ్రెస్ట్ వాల్.. లోపలికి నీళ్లు చేరకుండా రక్షిస్తూ ఉంటుంది. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు మేడిగడ్డ బ్యారేజీకి 17 లక్షల క్యూసెక్కుల వరద పోటెత్తడం, హెడ్ రెగ్యులేటర్ గేట్ల నిర్వహణ, బ్రెస్ట్ వాల్ మెయింటనెన్స్ లోపాలతో ఆ వాల్ కొట్టుకుపోయి పంపుహౌస్ నీట మునిగింది.
రూ.180 కోట్లతో నిర్మించిన సబ్ స్టేషన్ కూడా నీటిలో మునిగిపోయింది. కన్నెపల్లి పంపుహౌస్లో మోటార్లతో పాటు రూ.50 కోట్ల విలువైన స్కాడా సిస్టమ్, కంట్రోల్ ప్యానళ్లు, రూ.150 కోట్లతో ఏర్పాటు చేసిన ఆటోమేటెడ్ అడ్వాన్స్డ్ ఎయిర్ కండీషన్ సిస్టం తదితర పరికరాలు మునిగిపోయాయి.
More Stories
గాంధీజీ శాంతి, సహనం, సత్యం సందేశం మానవాళికి ప్రేరణ
మాలవీయ మిషన్ పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం
సుంకాల యుద్ధం మధ్య స్వదేశీ, స్వావలంబనలకై భగవత్ పిలుపు