పలు అవలక్షణాలను అవశేషాలుగా మిగిల్చిన బ్రిటిష్ విద్యా విధానం

పలు అవలక్షణాలను అవశేషాలుగా మిగిల్చిన బ్రిటిష్ విద్యా విధానం
బ్రిటిష్ విద్యా విధానం దేశంలో పలు అవలక్షణాలను అవశేషాలుగా మిగిల్చిందని పేర్కొంటూ బ్రిటిష్ వారు భారతదేశంపై తమ పెత్తనం సాగించేందుకు వలసపాలకుల లక్షణంతో ఈ మెకాలే విద్యా విధానాన్ని రుద్దారని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. ఈ విద్యావ్యవస్థలో దేశంలో కేవలం సేవకుల శ్రేణి ఏర్పడే వాతావరణం నెలకొందని చెప్పారు. 
 
జాతీయ విద్యా విధానం (ఎన్‌ఇపి) అమలుపై వారణాసిలో జరిగిన ఓ సదస్సును ఉద్ధేశించి ప్రధాని మోదీ ప్రసంగిస్తూ అప్పట్లో పాలకులకు తమ వద్ద పనిచేసే గుమాస్తాలు, కింది స్థాయి సిబ్బంది అవసరం అని గుర్తు చేశారు.  అంతకు మించి వారికి ఎటువంటి ఉన్నత ప్రతిభా వికాసం కలుగకూడదనే భావనతోనే ఈ బానిసత్వపు పోకడల విద్యా విధానాన్ని తీసుకువచ్చి వెళ్లారని తెలిపారు.
దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లు అయినా ఆ గుర్తుల విద్యావిధానం ఇంకా సజీవంగానే ఉందని, పెద్దగా మార్పులు రాలేదని ప్రధాని విచారం వ్యక్తం చేశారు. విద్యావ్యవస్థ వల్ల మనిషి భవిష్యత్తు అన్ని విధాలుగా వికాసం చెందాల్సి ఉంటుందని, కేవలం డిగ్రీలు పొందేవారిని ఉత్పత్తి చేసి నిరుద్యోగ మార్కెట్లలోకి పంపించే విధంగా ఉండటం కాదని ప్రధాని స్పష్టం చేశారు.
 
బ్రిటిష్ వారు తమ అవసరాలకు అనుగుణంగా రూపొందించిన విద్యా విధానం దుష్పరిణామాలను ఇప్పటికీ చవిచూడాల్సి వస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విద్యావ్యవస్థ సమగ్రత అనేది కేవలం దాని ద్వారా దేశ పురోగమనానికి అవసరం అయిన వనరుల సృష్టికి వీలేర్పడటం ద్వారానే స్పష్టం అవుతుందని ప్రధాని తెలిపారు. 
 
డిగ్రీలు పొంది, తరువాత సరైన మానవ వనరుల క్రమంలోకి చేరే అవకాశాలు లేకపోవడం వల్ల దేశానికి వ్యక్తులకు మేలు ఏం జరుగుతుందని మోదీ ప్రశ్నించారు. స్వాతంత్య్ర భారతంలో విద్యావ్యవస్థలో కొన్ని మార్పులు చేపట్టడం జరిగినా మార్పు అత్యల్పం, జరగాల్సింది అనల్పంగా ఉందని పేర్కొన్నారు. నూతన విద్యావిధానంపై మూడు రోజుల సదస్సును కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ యుజిసి, బనారస్ హిందూ యూనివర్శిటీతో కలిసి ఏర్పాటు చేసింది. 
 
నేటి పిల్లల సృజన వారి ఆవిష్కరణల పాటవాలకు అనుగుణంగా ఉండే విధంగా విద్యావ్యవస్థలో మార్పులు రావాలని ప్రధాని పిలుపు నిచ్చారు. నేటి విద్యార్థులు ఇతరులను సవాలు చేసే విధంగా గుగూల్ ద్వారా సకల సమాచారం పొందుతున్నారని యూ ఈ బాలలు విశ్వవిద్యాలయాల స్థాయి వరకూ వచ్చేసరికి వారి ప్రశ్నలకు వారి ఆకాంక్షలకు అనుగుణంగా సమాధానాలతో కూడిన విద్యావ్యవస్థను పూర్తి స్థాయిలో సంతరించుకోవల్సి ఉందని ప్రధాని స్పష్టం చేశారు. 
 
సదస్సులో కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, యుపి గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా పాల్గొంటున్నారు. కేంద్రం తీసుకువచ్చిన నూతన విద్యా విధానం అమలు తీరు తెన్నులు గురించి దేశవ్యాప్తంగా పలు చోట్ల సదస్సులను నిర్వహించేందుకు కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ వీటిని ఏర్పాటు చేస్తోంది.
మహా వంటశాల ప్రారంభం 

కాగా,  బీజేపీ హయాంలో అభివృద్ధి అనేది కేవలం ఆడంబరం మాత్రమే కాదని, చేతల్లోనూ ఉంటుందని వారణాసిలో మహా వంటశాలను ప్రారంభిస్తూ ప్రధాని చెప్పారు. లక్ష మందికి వంట చేయగల సామర్థం ఉన్న మెగా కిచెన్‌ను.. వారణాసిలోని ఎల్టీ కళాశాలలో ఏర్పాటు చేశారు.  ‘మా దృష్టిలో అభివృద్ధి అంటే.. పేదలు, అణగారిన, వెనుకబడిన, గిరిజన, తల్లులు మరియు సోదరీమణుల సాధికారత” అని ప్రధాని మోదీ ప్రకటించారు.

అర్హులైన వాళ్లకు పక్కా ఇళ్లు, ప్రతీ ఇంటికి మంచి నీటిని అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధాని తెలిపారు. అక్షయపాత్ర సంస్థ దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో భారీ సంఖ్యలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తోంది. ఈ సంస్థ ఈ యంత్ర సహిత వంటశాల ద్వారా 150 పాఠశాలలకు భోజనం సరఫరా చేస్తారు.

ప్రారంభోత్సవం అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ, ఇలాంటి భారీ సామర్థ్యం ఉన్న కిచెన్ లతో విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. సొంత నియోజకవర్గం వారణాసిలో ప్రజల మధ్య ఉండడం తనకెప్పుడూ సంతోషం కలిగిస్తుందని తెలిపారు.