నీరవ్‌ మోదీ ప్రధాన అనుచరుడు అరెస్ట్

నీరవ్‌ మోదీ ప్రధాన అనుచరుడు అరెస్ట్

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ) స్కాం కేసులో సీబీఐ కీలక పురోగతిని సాధించింది. బ్యాంకులకు వేల కోట్ల ఎగనామం పెట్టి విదేశాలకు చెక్కేసిన వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీ ప్రధాన అనుచరుడు సుభాష్‌ శంకర్‌ను ఈజిప్టు రాజధాని కైరోలో సీబీఐ అరెస్ట్‌ చేసినట్లు తెలుస్తోంది. 

ఇప్పటి వరకు ఈజిప్టు రాజధాని కైరోలో తలదాచుకున్న అతడిని అక్కడి ప్రభుత్వంతో దౌత్యపరంగా, చట్టపరంగా చర్చలు జరిపి.. ముంబైకు తీసుకొచ్చారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి 13 వేల కోట్ల రూపాయల రుణాల ఎగవేత ఆరోపణలను నీరవ్ మోదీ ఎదుర్కొంటున్నారు. ఈ స్కామ్‌లో సుభాష్‌ శంకర్‌ కీలక నిందితుడు.

నీరవ్‌కు చెందిన ఫైర్‌స్టార్‌ డైమండ్‌ కంపెనీ ఫైనాన్స్‌ విభాగంలో డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌గా పరబ్‌ వ్యవహరించేవాడు. పీఎన్‌బీకి సమర్పించిన నకిలీ లెటర్‌ ఆఫ్‌ అండర్‌టేకింగ్స్‌ ఇతడినే ప్రత్యక్ష సాక్షి అని సీబీఐ భావిస్తున్నది. పీఎన్‌బీ స్కాంకు సంబంధించి సీబీఐ అభ్యర్థన మేరకు. నీరవ్, అతని సోదరుడు నిషాల్ మోదీ, అతని ఉద్యోగి సుభాష్ శంకర్ పరబ్‌లపై ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసులను జారీ చేసింది.

2018లో కేసు నమోదైనప్పటి నుంచి సుభాష్ శంకర్ పరారీలో ఉన్నాడు. అతడు కైరోలో అజ్ఞాతంలో దాక్కున్నాడు. తమకు అందిన ఇన్‌పుట్‌ల ఆధారంగా సీబీఐ ఆపరేషన్ నిర్వహించి శంకర్‌ని పట్టుకుంది. అతడిని ప్రత్యేక విమానంలో సీబీఐ అధికారులు ముంబైకి తీసుకొచ్చినట్లు సమాచారం. ఇక కేసులో మరిన్ని వివరాలను సేకరించేందుకుగాను సుభాష్‌ను విచారణ నిమిత్తం కస్టడీకి సీబీఐ కోరనుంది.