యుపి ఆర్ధిక వ్యవస్థను రెండో స్థానంలో నిలిపాం

యుపి ఆర్ధిక వ్యవస్థను రెండో స్థానంలో నిలిపాం
గత ఐదేళ్లలో బీజేపీ ప్రభుత్వం అన్ని ముఖ్యమైన లక్షాలను నెరవేర్చిందని, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ చెప్పారు. ఏ బీజేపీ ప్రభుత్వ పాలనా కాలంలో మతపరమైన హింసాత్మక సంఘటనలు, ఉగ్రవాద దాడులు జరగలేదని స్పష్టం చేశారు. పెట్టుబడిదారులకు ప్రధాన ఎంపికగా తమ రాష్ట్రాన్ని నిలిపామని, ఈజ్‌ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో తన నేతృత్వంలో ప్రభుత్వం ఉత్తరప్రదేశ్‌ను 14 నుంచి రెండోస్థానానికి తీసుకెళ్లిందని పేర్కొన్నారు. 
 
టెక్నికల్, ఇతర రంగాల వారీగా బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంస్కరణల ద్వారా మాత్రమే ఇది సాధ్యమైందని ఆయన చెప్పారు.తన కృషి వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దేశంలో రెండో స్థానానికి చేరిందని తెలిపారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత తలసరి ఆదాయం సంవత్సరానికి రూ. 47,000 ఉండేదని, ఇప్పుడు దీన్ని రూ. 54,000 కు తీసుకెళ్లినట్టు తెలిపారు. 
 
రాష్ట్ర వార్షిక బడ్జెట్ ను రూ. 2 లక్షల కోట్ల నుంచి రూ. 6 లక్షల కోట్లకు పెంచామని పేర్కొన్నారు.కరోనా సంక్షోభాన్ని తమ ప్రభుత్వం దీటుగా ఎదుర్కొందని, ప్రతి వయోజన వ్యక్తి కరోనా టీకా మొదటి డోసు తీసుకున్నారని, సుమారు 70 శాతం మంది అర్హులు రెండు డోసులు తీసుకున్నారని చెప్పారు. ఈ మహమ్మారిని ఎదుర్కోవడంలో తమ రాష్ట్రాన్ని దేశానికి ఓ ఉదాహరణగా నిలిపామని తెలిపారు.