
భాషను మరచిపోయిన నాడు, మన సంస్కృతి కూడా దూరమవుతుందని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు హెచ్చరించారు. మన ప్రాచీన సాహిత్యాన్ని యువతకు చేరువ చేయాలని ఆయన సూచించారు.
వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా రూపొందించిన 100 వ పుస్తకాన్ని న్యూఢిల్లీ నుంచి ఇంటర్నెట్ వేదిక ద్వారా ఉపరాష్ట్రపతి ఆవిష్కరించారు. ఉన్న పదాలను సమర్థంగా వాడుకోవడం, నూతన మార్పులకు అనుగుణంగా కొత్త తెలుగు పదాలను సృష్టించుకోవడం అవసరమని ఆయన తెలిపారు.
అందరికీ అందుబాటులోకి వచ్చే విధంగా తెలుగు సాహిత్య పునరుజ్జీవం జరగాల్సిన అవసరం ఉన్నదని, భాష-సంస్కృతుల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ చొరవ తీసుకోవాలని కోరారు.
2020 అక్టోబర్ నెలలో వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, శ్రీ సాంస్కృతిక కళా సారధి (సింగపూర్), తెలుగు మల్లి (ఆస్ట్రేలియా), ఛార్లెస్ ఫిలిప్ బ్రౌన్ తెలుగు సమాఖ్య (యునైటెడ్ కి౦గ్ డమ్), దక్షిణ ఆఫ్రికా తెలుగు సాహిత్య వేదిక (జొహానెస్ బర్గ్) సంయుక్తంగా నిర్వహించిన 7 వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సులోని అంశాలను పుస్తక రూపంలో తీసుకొచ్చారు.
సాహితీ సదస్సును, పుస్తకాన్ని ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు అంకితం చేయడం పట్ల వెంకయ్యనాయుడు అభినందనలు వ్యక్తం చేశారు. రెండు దశాబ్దాలకు పైగా తెలుగు భాషా సదస్సులు నిర్వహిస్తున్న వంగూరి ఫౌండేషన్ కృషి ముదావహమని వెంకయ్యనాయుడు ప్రశంసించారు. 100 పుస్తకాలను ప్రచురించడం గొప్ప ప్రయత్నమని కొనియాడారు.
భాషా సంస్కృతుల కోసం ప్రతీ ఒక్కరి నుంచి ఇలాంటి చొరవను ఆకాంక్షిస్తున్నానని ఆయన తెలిపారు. తెలుగు భాష సంస్కృతులను ముందు తరాలకు తీసుకుపోయే ఏ అవకాశాన్ని వదులుకోరాదని సూచించారు.
అభివృద్ధి చెందుతున్న శాస్త్ర సాంకేతికత విజ్ఞానం భాషాభివృద్ధికి అనుకూలంగా ఎన్నో నూతన అవకాశాలను అందిస్తోందన్న ఉపరాష్ట్రపతి, వీటిని సమర్థవంతంగా వినియోగించుకోవడం ద్వారా భాషా సంస్కృతులను అభివృద్ధి చేసుకోగలమని తెలిపారు. నిద్ర లేచింది మొదలు మన వినియోగించే ఎన్నో పదాల్లో ఆంగ్లం కలసిపోతుండడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు.
ఉన్న పదాలను సమర్థవంతంగా వాడుకోవడం, నూతన మార్పులకు అనుగుణంగా కొత్త తెలుగు పదాలను సృష్టించుకోవడం అవసరమని ఆయన తెలిపారు. అంతర్జాల వేదికగా సాహిత్య, భాషాభివృద్ధికి కృషి చేస్తున్న సంస్థలను ఈ సందర్భంగా అభినందించారు. వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వ్యవస్థాపకులు వంగూరి చిట్టెన్ రాజు, వంశీ ఆర్ట్స్ థియేటర్ వ్యవస్థాపకులు వంశీరామరాజుతోపాటు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలకు చెందిన ప్రవాసాంధ్రులు, తెలుగు భాషాభిమానులు, తెలుగు సాహితీవేత్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
More Stories
మహిళా జర్నలిస్టులు లేకుండా ఆఫ్ఘన్ మీడియా సమావేశం
నవంబర్ 25న పూర్తి కానున్న అయోధ్య రామాలయం
ఐపీఎస్ అధికారి పూరన్ ఆత్మహత్యపై సిట్