29న‌ యూకే, ఇట‌లీ దేశాల‌కు ప్ర‌ధాని మోదీ

ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ ఈ నెల 29న ఇట‌లీ, యూకే దేశాల ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌లుదేర‌నున్నారు. ఆ రెండు దేశాల్లో ఈ నెల 29 నుంచి న‌వంబ‌ర్ 2 వ‌ర‌కు ఐదు రోజుల పాటు ఆయ‌న ప‌ర్య‌ట‌న కొన‌సానుంది. ఇటలీలోని రోమ్ న‌గ‌రంలో, యునైటెడ్ కింగ్‌డ‌మ్‌లోని గ్లాస్గో న‌గ‌రంలో జ‌రిగే రెండు కీల‌క స‌ద‌స్సుల్లో ఆయ‌న పాల్గొన‌నున్నారు. 

వాటిలో ఒక‌టి జీ-20 స‌ద‌స్సు. ఈనెల 30, 31వ తేదీల్లో రోమ్ లో ఇటలీ ప్రధాని అధ్యక్షతన జరగనున్న జీ-20 దేశాల సదస్సులో ప్రధాని మోదీ  పాల్గొంటారు. ఈ సదస్సులో కరోనా మహమ్మారి విలయం, ఆరోగ్యం విషయాల్లో అంతర్జాతీయ సహకారం, ఆర్ధిక వ్యవస్థను పునరుద్ధరించడం, ఆహార భద్రత, సుస్థిర అభివృద్ధి, వాతావరణ మార్పు తదితర అంశాలే అజెండాగా ఉన్నాయి.

జీ-20 సభ్య దేశాల అధ్యక్షులు, ప్రభుత్వ అధినేతలు పాల్గొనే ఈ సదస్సులో ప్రధాని మోదీ  పాల్గొనడం 8వ సారి కావడంతో ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. 2023లో ఈ సదస్సుకు భారత్ వేదిక కాబోతోంది. 

రోమ్ లో జరిగే జీ20 సదస్సు ముగిసిన అనంతరం ప్రధాని మోదీ  అక్కడ నుంచి స్కాట్లాండ్ లోని గ్లాస్కోకు బయలుదేరుతారు. అక్కడ ఈనెల 31 నుంచి నవంబర్ 12 వరకు జరగనున్న కాప్ -26 సదస్సుకు ప్రధాని హాజరవుతారు. నవంబర్ 1, 2వ తేదీల్లో జరిగే వరల్డ్ లీడర్స్ సమ్మిట్ రుతో జరిగే ఈ సమావేశంలో పాల్గొంటారు. 

 
ప్రపంచ వ్యాప్తంగా 120 దేశాల అధినేతలు హాజరవుతున్న ఈ సదస్సుకు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ అధ్యక్షత వహిస్తారు. గత ఏడాది జరగాల్సిన కాప్-26 సదస్సు కరోనా కారణంగా వాయిదాలు పడి తాజాగా ఇప్పుడు జరగనుంది.

ఈ ప‌ర్య‌ట‌న‌లో ప్ర‌ధాని ప‌లువురు దేశాధినేత‌ల‌తో ద్వైపాక్షిక స‌మావేశాల్లో పాల్గొన‌నున్నారు. ఇటలీ ప్ర‌ధాని మ‌రియో డ్రాగీతో కూడా ప్ర‌ధాని స‌మావేశ‌మై ప‌లు ద్వైపాక్షిక అంశాల‌పై చ‌ర్చించ‌నున్నారు. అదేవిధంగా గ్లాస్గోలో జ‌రిగే కాప్‌-26 స‌ద‌స్సు సంద‌ర్భంగా యూకే ప్ర‌ధాని బోరిస్ జాన్స‌న్ సహా ఇత‌ర దేశాల అధినేల‌తో ప్ర‌ధాని భేటీ కానున్నారు.