ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ పోలీసులు నమోదు చేసిన కేసులో టిడిపి అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అరెస్ట్ విషయంలో ఏపీ పోలీసులు అంకితోత్సవం పాటించారని, రాష్ట్రంలో చట్టబద్ధ పాలన ఉన్నదా అనే సందేహం కలిగించేటట్లు వ్యవహరించారని రాష్ట్ర హైకోర్టు ఆక్షేపణ తెలిపింది.
ఆయనకు రేమండ్ విధించిన మేజిస్ట్రేట్ ఉత్తరువును కూడా తప్పుబడుతూ బెయిల్ ఇవ్వడం, వేంటనే విడుదల కావడం వేగంగా జరిగిపోయాయి. చట్టానికి లోబడి అందరూ పని చేయాల్సిందేనని స్పష్టం చేసింది. రూల్ ఆఫ్ లా అమలు విషయంలో పోలీసుల వ్యవహారశైలిపై అభ్యంతరం వ్యక్తంచేస్తూ రోజూ పలు వ్యాజ్యాలు విచారణకు వస్తున్నాయని గుర్తుచేసింది.
చట్టం ముందు సీఎం నుంచి సామాన్యుడి వరకు అందరూ సమానమేనని, చట్టాని కంటే ఎవరూ ఎక్కువ కాదని వ్యాఖ్యానించింది. గౌరవం, ప్రతిష్ఠ ముఖ్యమంత్రికే కాదు… అందరికీ ఉంటాయని, వాటిని కాపాడాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని స్పష్టం చేసింది. పట్టాభి అరెస్ట్ సందర్భంగా అర్నేశ్కుమార్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను అనుగుణంగా వ్యవహరించారా? లేదా? అనే విషయంపై నివేదిక సమర్పించాలని విజయవాడ మూడో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ను ఆదేశించింది.
పట్టాభిని అరెస్ట్ చేసే ఉద్దేశం ఉంటే 41ఏ కింద నోటీసులు ఎందుకిచ్చారు? ఆ తరువాత ఎందుకు అరెస్ట్ చేశారని నిలదీసింది. 41ఏ కింద నోటీసులు ఇచ్చే విధానం ఇదేనా అని ప్రశ్నించింది. ఈ సెక్షన్ కింద నోటీసులు ఇచ్చిన తరువాత మేజిస్ట్రేట్ అనుమతి లేకుండా పిటిషనర్ను ఎలా అరెస్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఒకవైపు పట్టాభిని అరెస్ట్ చేయడానికి ఆయన ఇంటికి వెళ్లామని చెబుతూ… మరోవైపు సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద నోటీసులు ఇచ్చామని, సహకరించకపోవడంతోనే అరెస్ట్ చేశామని పరస్పర విరుద్ధమైన వివరాలను దర్యాప్తు అధికారి రిమాండ్ రిపోర్టులో పేర్కొనడం ఆత్మహత్యా సదృశం కాదా అని ప్రశ్నించింది.
రాజ్యాంగబద్ధ సంస్థలు, న్యాయమూర్తులను దూషిస్తున్నవారి విషయంలో చర్యలు తీసుకొనేందుకు ఉత్సాహం చూపని పోలీసులు… పట్టాభి అరెస్ట్ విషయంలో అత్యుత్సాహం చూపించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించింది. పోలీసులు అనుసరించాల్సిన విధానం ఎప్పుడూ ఒక్కటే ఉంటుందని… వ్యక్తులను బట్టి అది మారదని స్పష్టం చేసింది.
ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కె.లలిత ఆదేశాలిచ్చారు. బెయిల్ ఇవ్వడంపై ఏజీ అభ్యంతరం వ్యక్తంచేయగా న్యాయమూర్తి తోసిపుచ్చారు. పోలీసులు ఇచ్చిన నోటీసులో తేదీ, సమయం ఎందుకు పేర్కొనలేదని ఆమె నిలదీశారు.
More Stories
సంక్షేమ పథకాల నగదు బదిలీ ఎన్నికలయ్యే వరకూ వాయిదా
విజయవాడలో ప్రధాని రోడ్ షో- బ్రహ్మరథం పట్టిన ప్రజలు
వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి కౌంట్డౌన్ ప్రారంభం