మహిళ సంరక్షణ కార్యదర్శులను పోలీసులనడంపై పిల్

గ్రామ, వార్డు సచివాలయాల్లోని మహిళ సంరక్షణ కార్యదర్శులను పోలీసు శాఖలో ‘మహిళ పోలీసు’లుగా పరిగణిస్తూ ఏపీ ప్రభుత్వం జారీచేసిన జీవో 59ని సవాలు చేస్తూ హైకోర్టులో పిల్ దాఖలైంది.  ఏపీ పోలీసు చట్టం, రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా ఆ జీవో ఉందని పేర్కొంటూ విశాఖకు చెందిన ఆరేటి ఉమామహేశ్వరరావు వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.

పోలీసు శాఖలో జరిగే నియామకాలన్ని పోలీసు నియామక బోర్డు ద్వారా జరగాలని, అయితే అందుకు భిన్నంగా ప్రభుత్వ నిర్ణయం ఉందని తెలిపారు. పోలీసులు విధులు నిర్వర్తించే హోంగార్డులను సైతం పోలీసులుగా పరిగణించరని గుర్తు చేశారు.

అలాంటిది సచివాలయాల్లో విధులు నిర్వహించే మహిళ సంరక్షణ కార్యదర్శులను పోలీసులుగా పరిగణించడం చట్టవిరద్దుమని స్పష్టం చేశారు. మహిళ సంరక్షణ కార్యదర్శులను పోలీసులుగా పరిగణించడం, కానిస్టేబుళ్లకు ఉండే అధికారాలు కట్టబెట్టడం చట్ట వ్యతిరేకమని తెలిపారు.

ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకొని జోక్యం చేసుకోవాలని న్యాయస్థానాన్ని కోరారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ ముఖ్యకార్యదర్శి, డీజీపీ, రాష్ట్రస్థాయి పోలీసు నియామక బోర్డు ఛైర్మన్, ఏపీపీఎస్సీ ఛైర్మన్లను ఈ వ్యాజ్యంలో ప్రతివాదులుగా పేర్కొన్నారు.