
ఉత్తరాఖండ్ కొత్త ముఖ్యమంత్రిగా పుష్కర్సింగ్ ధామి ఎన్నికయ్యారు. ఈ మధ్యాహ్నం 3.00 గంటలకు ఉత్తరాఖండ్లోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో బిజేపీ శాసనసభాపక్షం సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకున్నది. కేంద్రమంత్రి నరేంద్రసింగ్ తోమర్, ఇతర సీనియర్ బీజేపీ నాయకుల సమక్షంలో ఉత్తరాఖండ్ బీజేఎల్పీ సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో ఎమ్మెల్యేలంతా కలిసి తమ కొత్త నాయకుడిగా పుష్కర్సింగ్ ధామిని ఎన్నుకున్నారు. బీజేఎల్పీ నేతగా పుష్కర్సింగ్ ధామి ఎన్నిక కావడంతో ఇక ఆయన ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పదవిని లాంఛనమే కానుంది. గత మార్చిలో సమర్థంగా పనిచేయలేకపోతున్నారనే కారణంతో అప్పటి ముఖ్యమంత్రి త్రివేంద్రసింగ్ రావత్ను పదవి నుంచి తప్పించి తీరథ్ సింగ్ రావత్కు ఆ పదవిని అప్పగించింది.
అయితే ప్రస్తుతం ఎంపీగా తీరథ్సింగ్ రావత్ సెప్టెంబర్ 10వ తేదీ లోగా ఎమ్మెల్యేగా ఎన్నిక కావాల్సి ఉంది.అయితే కరోనా మహమ్మారి విస్తృతి, వచ్చే ఏడాది ప్రారంభంలోనే ఉత్తరాఖండ్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఇప్పటికిప్పుడు ఉప ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం విముఖత వ్యక్తం చేసింది.
దాంతో తీరథ్సింగ్ రావత్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయకతప్పని పరిస్థితి ఏర్పడింది. ఆయన రాజీనామా చేయడంతో ఇప్పుడు కొత్త ముఖ్యమంత్రిగా పుష్కర్సింగ్ ధామిని ఎన్నుకున్నారు. బిజెపి ఒక సాధారణ కార్యకర్తకు ముఖ్యమంత్రి పీఠం కట్టబెట్టిందని ఉత్తరాఖండ్ నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్న పుష్కర్సింగ్ ధామి సంతోషం వ్యక్తం చేశారు.
ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వంలో అందరం కలిసికట్టుగా పనిచేస్తామని ఆయన చెప్పారు. తనకు ముఖ్యమంత్రిగా పనిచేసేందుకు నిండా ఏడాది కూడా సమయం లేదని, ఇంత తక్కువ కాలంలోనే ఇతర నాయకుల సాయంతో ప్రజలకు సేవ చేయడం సవాలు లాంటిదని, ఆ సవాలును తాను స్వీకరిస్తున్నానని ధామి వ్యాఖ్యానించారు.
కాగా, పుస్కర్ సింగ్ ధామి పితోగఢ్లో జన్మించారు. ఆ తర్వాత రాజకీయ రంగప్రవేశం చేసి రెండు సార్లు ఎమ్మల్యేగా గెలించారు. ఉద్ధమ్సింగ్ నగర్ జిల్లాలోని ఖతిమా అసెంబ్లీ నియోజకవర్గానికి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అంతకుముందు ధామి ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి కోశ్యారీ దగ్గర ఓఎస్డీగా పనిచేశారు.
More Stories
తిరిగి రాజరికం వైపు నేపాల్ చూస్తున్నదా?
దేశభక్తి, దైవభక్తి పదాలు భిన్నమైనా వేర్వేరు కాదు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు