చర్చి పాస్టర్ సహ 22 మంది అరెస్టు

కేరళలోని ఓ చర్చి పాస్టర్ ప్రార్ధనల పేరిట చిన్నపిల్లల ప్రాణాలకు ముప్పు తెచ్చాడు. కొవిడ్-19 ప్రోటోకాల్‌ ఉల్లంఘించాడు. ఎర్నాకుళం జిల్లాలోని పూవతుస్సేరీ గ్రామంలో మే 31 నాడు చిన్న పిల్లల కొరకు ఒక ప్రత్యేకమైన ప్రార్థనా కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా సంగ‌తి తెలుసుకున్న పోలీసులు అక్కడకు వెళ్లి వారిని అదుపులోకి తీసుకున్నారు.

ప్రస్తుతం లాక్‌డౌన్ అమల్లో ఉన్నందున ఈ కార్యక్రమం నిర్వహించడం నిబంధనలకు విరుద్ధమని, చర్చి పాస్టర్ జార్జ్ పాలమాట్టంతో పాటు ముగ్గురు పిల్లలు, వారి తల్లిదండ్రులు, బంధువులు సహా మొత్తం 22 మందిని అరెస్ట్ చేశారు. అంటువ్యాధుల నివారణ చట్టంలోని పలు సెక్షన్ల కింద వీరందరికీ కేసు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు.

కాగా అరెస్ట్ చేసిన కొద్ది సేపటికే వారందరినీ బెయిల్‌పై విడుదల చేసినట్టు పోలీసులు పేర్కొన్నారు. ఇదిలావుండ‌గా,  ఈ కార్యక్రమం కోసం పిల్లల తల్లిదండ్రులు విదేశాల నుంచి వచ్చారనీ తమ సెలవులు ముగుస్తుండడంతో తిరిగి వెళ్లిపోయేందుకు సిద్ధమయ్యారని దీంతో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు చర్చి నిర్వాహకులు పేర్కొన్నారు. లాక్‌డౌన్ కారణంగా ఇప్పటికే  రెండుసార్లు వాయిదా పడిందని.. దీంతో సోమవారం నిర్వహించినట్టు తెలిపారు.