భారత్ లో ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ భవిష్యత్!

భారత్ లో ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ భవిష్యత్!
మన దేశంలో సోషల్ మీడియా దిగ్గజాలైన ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌ ల భవిష్యత్ ప్రశ్నార్ధకరంగా మారింది.  ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌పై నిబంధనల పేరిట కత్తి వేలాడుతోంది. 
 
సోషల్‌ మీడియా కట్టడికి ఈ ఏడాది ప్రారంభంలో ఫిబ్రవరి 25న ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ రూపొందించిన కొత్త నియమావళి నేటి నుంచి అమల్లోకి వస్తున్నది.  కొత్త నిబంధనలను పాటించటానికి అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లకు మూడు నెలల గడువు ఇచ్చింది. 
ఆ మార్గదర్శకాల్లో సూచించిన విధంగా ఏర్పాట్లు చేసుకోవడానికి సామాజిక మాధ్యమాలకు, ఓటీటీలకు మే 25 దాకా కేంద్రం సమయం ఇచ్చింది.  ఒకవేళ ఈ సోషల్ మీడియా దిగ్గజ కంపెనీలు కొత్త నియమనిబంధనల్ని అంగీకరించకపోతే వాటిపై నిషేధం అనివార్యం కాగలదు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఐటీ నిబందనలలో అనేక అంశాలున్నాయి. ప్రతి సోషల్ మీడియా కంపెనీలకు భారత్ లో  సంబంధిత అధికారులు ఉండాలి. వారి పేర్లు, భారత్ లో  వారి అడ్రస్, ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారం, అభ్యంతరకరమైన కంటెంట్‌ను పర్యవేక్షించడం, సమ్మతి నివేదిక, అభ్యంతరకరమైన కంటెంట్ తొలగించడం వంటివి ఈ నియమాలలో ఉన్నాయి.
 
ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ, చీఫ్ కాంప్లియెన్స్ అండ్ గ్రీవియెన్స్ ఆఫీసర్స్‌ను నియమించడం వంటి చర్యలను సామాజిక మాధ్యమ సంస్థలు చేపట్టినట్లు ప్రభుత్వానికి తెలియజేయలేదని చెప్పారు.  ఈ నియామకాల విషయాన్ని మంత్రిత్వ శాఖకు చెప్పవలసిన అవసరం లేదని, వారి వెబ్‌సైట్లలోనే ఈ వివరాలను తెలియజేయవచ్చునని చెప్పారు. ఏమైనప్పటికీ, ఈ నిబంధనలు పాటించాలని తెలిపారు. 

ఏ సంస్థ కూడా ఇప్పటివరికి ఆ నిబందనలు అంగీకరించ లేదు. అందుకే భారత్ లో ఈ మూడు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై నిషేధం తప్పేలా లేదన్న చర్చ జరుగుతోంది. మే 26 నుంచి ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ బ్లాక్‌లిస్ట్‌లోకి వెళ్తాయన్న అనుమానాలు బలపడుతున్నాయి. గతంలో ఈ కంపెనీలు ఆరు నెలల సమయం కావాలని కోరాయి. దీనికి కేంద్రం ససేమిరా అంటోంది. దీంతో ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి సామాజిక సోషల్ మీడియాల సర్వీసులు నిలిపివేయడమో లేదా తాత్కాలికంగా ఆగిపోవడమో జరిగే అవకాశం ఉంది.

ఇలా ఉండగా, ప్రజలు స్వేచ్ఛగా, సురక్షితంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేయగలిగే వేదికగా ఉపయోగపడేందుకు కట్టుబడి ఉన్నట్లు ఫేస్‌బుక్ తెలిపింది. ఫిబ్రవరిలో ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపింది. కొన్ని నిబంధనలపై చర్చ జరుగుతోందని, ఈ విషయంలో ప్రభుత్వంతో మరిన్ని సమావేశాలు జరగవలసి ఉందని పేర్కొంది.  ఐటీ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) రూల్స్‌‌ నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించడంపై దృష్టిపెట్టినట్లు ఫేస్‌బుక్ అధికార ప్రతినిధి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.