పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలన

కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో నారాయణ స్వామి ప్రభుత్వం కూలిపోయిన అనంతరం ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ సహా మరే ఇతర పార్టీ ముందుకు రాకపోవడంతో రాష్ట్రపతి పాలనకు దారితీసింది. ఆ మేరకు లెఫ్టినెంట్ గవర్నర్ సౌందర్యరాజన్ తమిళిసైచేసిన ప్రతిపాదనకు కేంద్ర క్యాబినేట్ బుధవారం ఆమోదం తెలిపింది. అనంతరమే పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలన ప్రారంభమైంది. 

పుదుచ్చేరిలో నారాయణస్వామి నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం కూలిపోయింది. అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకోలేక.. ముఖ్యమంత్రి పదవికి నారాయణస్వామి సోమవారం రాజీనామా చేశారు. 33 మంది ఎమ్మెల్యేలున్న అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యేపై అనర్హత వేటు, ఐదుగురు ఎమ్మెల్యేల రాజీనామాతో కాంగ్రె్‌స-డీఎంకే కూటమికి స్పీకర్‌తో కలిపి 12 మందే మిగిలారు. వీరిలో ఒక స్వతంత్ర ఎమ్మెల్యే ఉన్నారు.

మరోవైపు ఏడుగురు ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌, నలుగురు అన్నాడీఎంకే, ముగ్గురు బీజేపీ నామినేటెడ్‌ ఎమ్మెల్యేలతో కలిపి ప్రతిపక్ష కూటమికి 14 మంది ఎమ్మెల్యేలున్నారు. బలపరీక్షలో ముగ్గురు నామినేటెడ్‌ బీజేపీ సభ్యులకు ఓటేసే హక్కు లేదని సోమవారం నాటి అసెంబ్లీ సమావేశంలో ప్రభుత్వ విప్ అనంతరామన్‌ చెప్పినప్పటికీ ఆ అభ్యర్థనను స్పీకర్‌ పట్టించుకోలేదు.

దీంతో సీఎం నారాయణస్వామి అసెంబ్లీ నుంచి బయటికి వెళ్లిపోయారు. మంత్రులు, అధికార పక్షం ఎమ్మెల్యేలూ ఆయన వెంటే బయటికి వెళ్లిపోవడంతో ప్రభుత్వం బలపరీక్షలో విఫలమైందని స్పీకర్‌ప్రకటించారు. అసెంబ్లీ నుంచి రాజ్‌నివాస్ కు వెళ్లిన నారాయణస్వామి ఎల్‌జీకి రాజీనామాపత్రాన్ని అందించారు.